Wednesday, June 18, 2025
మూడు వెంట్రుకల రాణి కథ
మా మేనత్త పేరు తులసమ్మ.చిన్నప్పుడు మాకు తమాషా కథలు చాలా చెప్పేది.అందులో ఇది ఒకటి.
ఒక రాజుకు ముగ్గురు రాణులు ఉంటారు.మొదటి రాణికి ఒక వెంట్రుక ఉంటుంది.రెండో రాణికి రెండు వెంట్రుకలు ఉంటాయి.అందుకని ఆమెకు గర్వం.మూడో రాణికి మూడు వెంట్రుకలు ఉంటాయి.ఆమెకు ఇంకా గర్వం ఎక్కువ,అందరికంటే తనే ఎక్కువ అందగత్తెను అని.మొదటి రాణి చాలా మంచి మనసు కల ఉత్తమురాలు.రెండు,మూడవ రాణులకు గర్వం,భేషజం ఎక్కువ.ఎప్పుడూ పెద్ద రాణిని కించ పరుస్తుంటారు.ఒక రోజు మూడవ రాణి విహారానికి వెళుతుంది.దారి అంతా గతుకుల మయంగా,మురికి నీరు నిండి ఉంటుంది.ఛీ!ఛీ!ఛీ!అని అసహ్యించుకుంటూ,ప్రక్కన మంచి దారిలో వెళ్ళి పోతుంది.ఇంకొంచెం దూరం పోయిన తరువాత ఒక గొడ్ల కొష్టం కనిపిస్తుంది.అందులో ఒక ఆవు దాహానికి అరుస్తూ ఉంటుంది.దాని పరిసరాలు కూడా శుభ్రంగా ఉండవు.రాణి ఛీ!ఛీ!ఛీ! అనుకుంటూ,అసహ్యించుకుని వెళ్ళిపోతుంది.ఇంకొంచెం ముందరికి పోతుండగా చిన్న పిల్లవాడు ఆకలికి ఏడుస్తుంటాడు.ఛీ!ఛీ!ఛీ!ఎక్కడకు పోయినా ఈ బీద ఏడుపులు,ఆకలి గోలలు అని అసహ్యించుకుంటూ ముందరికి పోతుంది.ఇంకాసేపు ముందరికి పోయిన తరువాత ఒక కొలను కనిపిస్తుంది.చుట్టు పక్కన పరిసరాలు అన్నీ ఆహ్లాదభరితంగా,సువాసనలతో,సుందరమయిన పూతోటలతో ఉంటాయి.మూడో రాణి అక్కడకు చేరగానే,ఈ కొలనులో మూడు మునకలు వేస్తే,అసమాన సౌందర్యం మీ సొంతం అవుతుంది అని అశరీరవాణి పలుకులు వినిపిస్తాయి.రాణి ఇలా ఆలోచిస్తుంది.ఇప్పటికే నేను చాలా సౌందర్యవతిని.రాజును నా కనుసన్నలలో తిప్పుకుంటున్నాను.ఈ కొలనులో ముణిగి,ఇంకా అసమాన సౌందర్యవతిని అయితే ఇక నాకు తిరుగులేదు.ఇలా అనుకుని,మూడు మునకలు వేసి,బయటకు వస్తుంది.ఆశ్చర్యం!నెత్తి మీద ఉండే మూడు వెంట్రుకలు పోయి,బోడి గుండు దర్శనం ఇస్తుంది.
రెండవ రాణికి కూడా ఇలానే జరుగుతుంది.
మూడవరాణి రోజంతా కష్టపడి,అలసి పోయి,విశ్రాంతిగా ఉంటుంది మనసుకు అని బయలు దేరుతుంది.దారిలో అంతా అసహ్యంగా,గుంటలు మిట్టలుగా కనిపిస్తుంది.అయ్యో!ఇలాంటి దారిలో నడవడం ఎవరికైనా కష్టం కదా!అనుకుంటుంది.దగ్గరలో ఉండే మన్నుతో గుంతలు పూడ్చి,రాళ్ళు రప్పలు తీసి వేసి ముందరికి వెళుతుంది.ఇంకొంచెం దూరం పోయిన తరువాత గొడ్ల కొష్టంలో ఆవు దాహానికి అరుస్తూ కనిపిస్తుంది.అయ్యో!అనుకుంటూ వెళ్ళి దాని చుట్టుపక్కల కూడా శుభ్రం చేస్తుంది.దగ్గరలో నుండి మంచి నీరు,తినేదానికి గ్రాసము తెచ్చి ఇస్తుంది.ఇంకా ముందరికి వెళుతుంటే చిన్న పిల్లవాడి ఆకలి ఏడుపు వినిపిస్తుంది.అయ్యో!పిల్లవాడి అమ్మ కూడా దగ్గరలో ఉన్నట్లు లేదు!క్షణం ఆలస్యం చేయకుండా తనతో తెచ్చుకున్న పాలు,పండ్లు ఆ బిడ్డకు తినిపించి బయలుదేరుతుంది.ఇంకొంచెం దూరం వెళ్ళిన తరువాత ఒక తటాకం కనిపిస్తుంది.చాలా అలసి పోయాను.కొంచెం నీళ్ళలోకి దిగి,స్నానం చేస్తాను అని దిగుతుంది.ఆమె ఆ నీటిలో మూడు మునకలు వేయగానే అతిరూపలావణ్యవంతురాలు అవుతుంది.
ఈ కథకు సారాంశం ఇది.బాహ్య సౌందర్యం శాశ్వతం కాదు.అది చూసుకుని మనుష్యులు గర్వానికి,అతిశయానికి పోకూడదు.మానసిక సౌందర్యమే మనకు ముఖ్యము.మంచి మనసు,సహనం,సహాయం చేసే గుణాలే అసలైన సౌందర్యాలు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment