Thursday, October 31, 2024

శుభకార్యాలప్పుడు పిలుపులు

మనం శుభకార్యాలకు చాలా మందిని పిలుస్తుంటాము.ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత గబుక్కున గుర్తు వస్తుంది.మనకు చాలా ముఖ్యమయిన,దగ్గర వాళ్ళను పిలవటం మరిచిపోయామని.వాళ్ళు ఎదురైతే ఏమి సమాధానం చెప్పాలా అని తల పట్టుకుంటాము.చాలా మంది భార్యాభర్తలు ఇద్దరూ పిలిస్తేనే కానీ రారు.ఇప్పుడిప్పుడు కొంచెం ఆ మొండిపట్టు తగ్గుతున్నది.మర్యాదగా అందరూ రండి అని పిలిచి వస్తాము.కానీ కొన్ని చోట్ల పిలిచేవాళ్ళ పక్కన ఒక అతను పుస్తకం పట్టుకుని ఉంటాడు.ఎంత మంది హాజరు అవుతారు మీ ఇంటి నుంచి అని అడిగి రాసుకుంటాడు.వృథా ఖర్చులు తగ్గించడానికి అని తెలిసింది.కొంత మందిని పిలవాలి కాబట్టి పిలుస్తాము.వాళ్ళు వచ్చినా రాకపోయినా మనకు పెద్ద తేడా ఉండదు.సందడి,పండగ వాతావరణం,పది మందికి భోజనాలు పెడితే మంచిది అని పిలుస్తాము.ఒక్కో సారి మనం పిలిచేదానికి వెళ్ళిన చోట వేరే వాళ్ళు ఉంటారు.పిలవకపోతే బాగుండదని మొహమాటానికి పిలుస్తాము.కొంత మందిని అసలు పిలవము కానీ శుభకార్యం జరుగుతుంది అని వస్తారు.మరీ దగ్గర వాళ్ళయితే రాకపోతే ఒప్పుకోము అని బెదిరిస్తాము.ఏది ఏమైనా ఒక కార్యం జరిగినప్పుడు పది మంది కలిస్తేనే బాగుంటుంది,హడావుడి,సంతోషం,నిండుదనం ఉంటుంది.కాబట్టి పిలిచే ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా,వాళ్ళు నిజంగానే రావాలి ఆని పిలిస్తే మంచిది కదా.అన్ని దానాలలోకి అన్నదానం మంచిది కదా.మన లోగిలిలో పది మంది సంతృప్తిగా తిని,అన్నదాతా సుఖీభవ అని దీవిస్తే మనకు సంతోషం,తృప్తిగా ఉంటుంది.అందుకనే నిజంగా పిలుపులు మొదలు పెట్టేముందు అసలు ఉరామరికగా ఎంత మందిని పిలవాలి అని తేల్చుకోవాలి.కాగితం,పెన్ను తీసుకుని మనకు తెలిసిన,ముఖ్యమమయిన వాళ్ల పేర్లు,బంధువుల పేర్లు రాసుకోవాలి.అలా అయితే మఖ్యమయిన వాళ్ళను మర్చిపోయే తప్పు చేయము.ఒక పెద్ద కార్యం అనుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి తప్పొప్పులు జరుగుతుంటాయి.అవి కావాలని చేసేవి కాదు కదా.ఆ హడావుడిలో,పని తొందరలో మర్చిపోతుంటాము.కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి.

Tuesday, October 29, 2024

సమానత్వం పిల్లలతో

సమానత్వం పాటించాలి అని అందరమూ అనుకుంటాము.కానీ నిజంగా సాధ్యమవుతుందా?భీముడు ఎక్కువ తింటాడు కదా!సమానత్వం అని కుంతి అంతే పెట్టదు కదా బిడ్డలకందరికీ.ఇక్కడ సమానం అంటే ఎవరి ఆకలి ఎంతో తెలుసుకుని,వాళ్ళ ఆకలి తీర్చడం.అంతే కానీ తినలేని వాళ్ళకి కుక్కి కుక్కి పెట్టటం కాదు.లేకపోతే మిగిలిన నలుగురు పాండవులు తిన్నంతే పెట్టి భీముడిని అర్థాకలితో కంచం ముందర నుంచి లేపడం కాదు.తరగతి గదిలో ఇరవై మంది పిల్లలుంటే,అందులో నలుగురు మాట్లాడారు నిశ్శబ్దం పాటించకుండా అనుకో.మాస్టర్ కి ఆ నలుగురు ఎవరో తెలియదు కానీ కొంత మంది మాట్లాడుతున్నారు అని తెలుస్తుంది.సమానత్వం అని అందరినీ శిక్షించాడు అంటే తప్పు కదా!తప్పు చెయ్యని వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తున్నారు కదా.కాబట్టి సమానత్వం అని మూర్ఖంగా ఆలోచించకుండా,సమయస్ఫూర్తిగా,స్ఫూర్తిదాయకంగా వ్యవహరించాలి.ఇండ్లలో కూడా చిన్నవాళ్ళు అంటే ఇష్టం,లేక పెద్ద వాళ్ళు అంటే ఇష్టం అమ్మ నాన్నలకు అని పిల్లలు అపోహ పడుతుంటారు చాలా సార్లు.ఒక్కో బిడ్డ మనస్తత్వం,వయసు,అప్పటి పరిస్థితి అన్నీ నిర్ణయిస్తాయి తల్లి తండ్రుల స్పందన ఆ క్షణంలో.ఇంత కంటే ముఖ్యంగా తల్లితండ్రుల మానసిక,వ్యవహారిక పరిస్థితి ఆ సమయంలో చాలా ముఖ్యం.సంతోషంగా ఉన్నారు అనుకో తేలికగా తీసుకుంటారు.అదే చికాకుగా,ఇబ్బందుల్లో ఉన్నారు అనుకో ఊరికే కోపం,విసుకు వస్తుంటుంది.మనందరమూ మనుష్యులమే కదా!కాబట్టి ఎవరు కూడా అన్నీ పట్టి పట్టి చూడ కూడదు.చాలా మందికి మనసులో ప్రేమలు ఉంటాయి,కానీ బయటకు చూపించడం తెలియదు.మనమంటే ప్రేమలేదు అని ఎదుటి వాళ్ళు దిగులు పడుతుంటారు.అందుకనే నేను ప్రతి ఒక్కరికీ చెప్తాను ప్రేమలు వ్యక్తం చెయ్యండి.మీరు తొందర పడ్డారు,అనవసరంగా బాధ పెట్టారు అని అనిపిస్తే మొహమాటం లేకుండా సారీ చెప్పండి.అప్పుడు అపోహలు,అసంతృప్తులు,అనుమానాలు ఉండవు.మన మనసులో అందరినీ సమంగా చూస్తున్నాము అని అనుకుంటే అది మీ మాటలు,చేతలు ద్వారా ఎదుటి వాళ్ళకు అర్థం అయ్యేలా చెయ్యండి.వాళ్ళే మనలని అర్థం చేసుకోవాలి అని అనుకోవద్దు.దీనినే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు.అది లేకుండా చూసుకోండి,దూరాలు పెంచుకోకండి.

Monday, October 28, 2024

తప్పులెన్నువారు……కానీ

తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అని అంటారు.నిజమే!తప్పేముంది?నేను ఉన్నాను.రోజులో నా మొహం రెండు లేక అయిదు నిముషాలు చూసుకుంటాను.రోజు మొత్తం వేరే వాళ్ళనే చూస్తూంటాను,వాళ్ళ మాటలు వింటుంటాను,వాళ్ళ చేతలు చేష్టలు గమనిస్తుంటాను.కాబట్టి వాళ్ళని విశ్లేషణ చేయటం నాకు సులభం.నా గురించి ఆలోచించడానికి అసలు సమయం ఎక్కడ మిగిలింది ఇంక?కానీ ఇక్కడే మనం కొంచెం ఆగి మన గురించి ఆలోచించుకోవాలి.మనం ఎంత సేపూ ఎదుటివాడు గులకరాయి తగిలి తట్టుకున్నాడు అని మందలిస్తాము.కానీ మనం పెద్ద బండరాయి కొట్టుకుని బోళ్ళ పడతాము.ఎదుటివారి తప్పొప్పులు,లోటుపాట్లు క్షుణ్ణంగా చెప్పగలతాము.మనం చాలా నిఖార్సు అయిన మనుష్యులం,మనం అసలు తప్పులు చేయమని గుడ్డి నమ్మకం.ఒక వేళ తప్పు జరిగినా మనల్ని మనం సమర్థించుకునేదానికి సవాలక్ష కారణాలు చెప్తాము.కారణాలు అంబులపొదిలోనుంచి అస్త్రాలు వచ్చినట్లు వస్తాయి.ఈ అతి మనమందరమూ మానుకోవాలి.ఆత్మ శోధన అప్పుడప్పుడు అన్నా చేసుకుంటూ ఉండాలి.మనం తప్పులు చేసుకుంటూ పోతే,పక్కవాళ్ళకి మంచి చెడ్డ ఏమీ చెప్పగలతాము?కాబట్టి ఎదుటి వాళ్ళలో తప్పులను వేలు ఎత్తి చూపించే ముందు మనం ఏ పాటి పద్ధతి గలవాళ్ళమో బేరీజు వేసుకోవాలి.వాళ్ళ పరిస్థితిలో ఉంటే మనం ఎలా వ్యవహరించి ఉంటాము అనే జ్ఞానం మనకు ఉండాలి.ముందు క్షమాగుణం ఉండాలి.ఎదుటి మనిషిని అర్థం చేసుకునేదానికి నిజంగా ప్రయత్నించాలి.

Sunday, October 27, 2024

అద్దం అబద్ధం చెప్పదు

అద్దంలో మనము ఎలా ఉంటామో అలాగే కనిపిస్తాము.దానికి ఏమీ మొహమాటాలు,భయాలు ఉండవు.ఉన్నది ఉన్నట్లే చూపిస్తుంది.అసలైన మంచి స్నేహితుడు అద్దంలాగా ఉండాలి అంటారు.పాత రోజుల్లో రాజులు రాజ గురువులని పెట్టుకునేవారు.వాళ్ళు సలహాలు ఇస్తారు,సంప్రదింపులు చేస్తారు.రాజు తప్పు మార్గం లో ఆలోచించినా,వెళుతున్నా మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళు.ఎందుకంటే వాళ్ళు డబ్బు ఆశించరు.రాజుకు కోపం వస్తుందేమో అని భయపడరు.మన మనసే మనకు అద్దం.మనం ఏదైనా తప్పు చేస్తే మన మనసుకి తెలుస్తుంది చాలా సార్లు.తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది.కనీసం మన మనసుకు మనం తప్పు దార్లో వెళుతున్నాము అనిపిస్తే,ఆగిపోవాలి.ఆ పని చేయకూడదు.ఆ మార్గంలో నడవకూడదు.ఎవరూ చూడటం లేదు,ఎవరికీ తెలియదు అని మనల్ని మనం మోసం చేసుకోకూడదు.మంచి మార్గం లో నడవాలి.మంచి స్నేహితులు ఉంటే మనకు తప్పని తెలియక చేసేపనులను ఆపుతారు.

Friday, October 25, 2024

భయం భయం …పారిపో!

ప్రతి ఒక్కరికీ చాలా రకాల భయాలు ఉంటాయి.కొందరికి బల్లి అంటే భయం,ఇంకొందరికి పిల్లి అంటే భయం.నలుగురులోకి రావాలంటే భయం.పదిమందిలో మాట్లాడాలంటే భయం.నిర్ణయాలు సొంతంగా తీసుకోవాలంటే భయం.ప్రాణ భయం,బీదరికం అంటే భయం,కష్టాలు అంటే భయం.ఇట్లా చెప్పుకుంటూ పోతే సవాలక్ష భయాలు వున్నాయి.మనము ఒకటే ఆలోచించాలి.మనకు భయం అని ఏదీ ఆగదు.మనము ఎదురుకోవాలి అన్నప్పుడు ఎన్ని రోజులు భయపడుతూ కూర్చుంటాము.మనకు భయమని ఎంతమందిని పక్కన పెట్టుకుని పోషిస్తాము?మనకు ధైర్యం జొప్పించేదానికి ఒకరు భుజాలు నొక్కుతూ,మరొకరు వీపు తడుతూ,ఇంకొకరు కాళ్ళు మర్దన చేస్తూ ఉండరు.ఎప్పుడూ మన యుద్ధం మనమే చెయ్యాలి.దానికి కావలసిన ధైర్యం,సన్నాహాలు మనమే చేసుకోవాలి.మనం భయస్థులమని సమస్యలు రాకుండా ఉండవు.ఈ రోజుల్లో అర్జునుడికి కృష్ణుడు వెన్ను తట్టినట్లు ఎవరూ మన వెనకాల ఉండరు.మనమే ద్విపాత్రాభినయం చేసుకోవాలి కృష్ణుడుగా,అర్జునుడిగా.అంటే మనకు మనమే గుండె ధైర్యం తెచ్చుకోవాలి.మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి.కాబట్టి భయాన్ని ఆమడ దూరం పంపించేద్దాము.ధైర్యంగా ముందుకు సాగుదాము.మన ధైర్యమే మనకు సగం గెలుపునిస్తుంది.

Thursday, October 24, 2024

లెక్కలేనితనం మానుకోవాలి

మనం ప్రతి ప్రాణికీ విలువ ఇవ్వాలి.మనమొక్కటే కాదుకదా ఈ భూమిపైన వుండేది?వాటి హక్కులని మనం కాలరాయకూడదు కదా!జంతువుల గురించే అలా మంచిగా మాట్లాడుకుంటున్నప్పుడు సాటి మనుష్యుల గురించి ఇంక ఎంత మంచిగా ఆలోచించాలి?కానీ చాలా చోట్ల పక్కవాళ్ళను కీతాగా చూడటం,అవమానించడం,హింసించడం,లెక్కలేనితనంగా వ్యవహరించడం చూస్తుంటాము.ఎదుటివాళ్ళను మనుష్యులుగా,మనకు సమానంగా చూడటం నేర్చుకోవాలి.మనల్ని చూసేకదా మన బిడ్డలు నేర్చుకుంటారు.వాళ్ళకు మనం మంచిగా విలువలు నేర్పించాలి కదా.ఎదురుతిరగలేనివాళ్ళు,అశక్తులు,చిన్నవాళ్ళు,బీదవాళ్ళు,సంఘంలో పెద్ద పేరుప్రతిష్ఠలులేనివాళ్ళు,అబలలు...వీళ్ళను పీడించడం గొప్ప అనుకునే వర్గం వుంది.ఆ భావజాలం నుంచి అందరూ బయటపడాలి.మనం ఎదుటివాళ్ళకు గౌరవమర్యాదలు ఇస్తేనే వాళ్ళు మళ్లీ తిరిగి మనకు ఇస్తారు.భయంతో మనమాట వినటం గొప్ప కాదు.మనమీద ప్రేమతో,గౌరవంతో మన మాటలకు విలువ దక్కేటట్లు చూసుకోవాలి మనం ఎప్పుడూ.నోటి దురుసు తగ్గించుకోవాలి.తప్పు జరిగితే చిన్నగా అర్థం అయ్యేటట్లు చెప్పి,ఆ తప్పు సరిదిద్దుకునేటట్లు చెయ్యాలి.ఊరికినే అరవటం,కొట్టటం,దూషించటం,కించపరచడం,వ్యంగ్యంగా మాట్లాడటం,తక్కువ చేసి మాట్లాడటం,ఎద్దేవా చేయటం మానుకోవాలి.అందరితో మంచిగా ఉండాలి.సర్దుకుని పోతూండాలి.చిన్నదానికి పెద్దదానికి ఘర్షణలు,గొడవలు మానుకోవాలి.చిన్నా పెద్దా అంతరం గుర్తించాలి.మన మాటలు,చేతలు,ఆలోచనలు ఎప్పుడూ లెక్కలేనితనంగా,ఎదుటివారిని బాధపెట్టే విధంగా,భయపెట్టేవిధంగా ఉండకూడదు.

Monday, October 21, 2024

వానప్రస్థం

పూర్వము రాజులుతమ రాజ్యాన్ని,రాజసంపదను బిడ్డలకు ఇచ్చేసి అడవులకో,హిమాలయాలకో వెళ్లే వాళ్ళు.ఎందుకు అనుకుంటున్నారు?వయసు మీరితే ఒంట్లో శక్తి తగ్గిపోతుంది.శత్రువులతో పోరాడలేము.మన తర్వాత తరం పగ్గాలుతీసుకోవాలి.వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తేనే కదా వాళ్ళు కూడా న్యాయంచేసేది.సంపదలు నా చేతిలో పెట్టుకుంటాను.నిర్ణయాలు నేనే తీసుకుంటాను.నేను చెప్పినట్లు మీరు చెయ్యాలంటే ఎవరు చేస్తారు?అట్లా అని అంత బతుకు బతికి,వాళ్ళ కింద వుండేదానికి మనసు ఒప్పుకోదు.అందుకని అన్నీ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు.దీనినే వానప్రస్థం అంటారు.ఇప్పుడు మనం అడవుల్లోకి,కొండలు గుట్టల్లోకి వెళ్ళలేము.మరి ఏమీ చెయ్యాలి?అంతా నాదే,నా కష్టార్జితమే అనేది మనసులో నుంచి తీసెయ్యండి.మనం మన బిడ్డల కోసమే కదా కష్టపడి సంపాదించింది.మనస్ఫూర్తిగా ఇచ్చేయండి.వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనియ్యండి.వాళ్ళేమీ చిన్న పిల్లలు కాదు,చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు.అందుకని వాళ్ళు చేసే ప్రతిపనిని ఆక్షేపించవద్దు వెనక నుంచి.బి ఎ రోమన్ ఇన్ రోమ్ అని అంటారు కదా.ఇప్పుడు పెత్తనం వాళ్లది,కాబట్టి గౌరవంగా పక్కకు తప్పుకుందాము.వాళ్ళ నిర్ణయాలు వాళ్ళనే తీసుకోనిద్దాము.అతిగా జోక్యం వద్దు.ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇప్పుడు కొత్త వానప్రస్థాలు.ఓపిక ఉన్నన్ని రోజులు సొంతగా ఉండండి.బిడ్డలకు సహాయంగా ఉండండి.ఏ పరిస్థితి అయినాప్రశాంతత కోల్పోవద్దు.ఆత్మ న్యూనత వద్దు.చాలా మంది మనకే ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చిన్న చిన్న వాటికే దిగులు పడుతుంటారు.ఎందుకు?ఎంత పోరాటం చెయ్యకపోతే జీవితంలో ఇంత దూరం వచ్చాము?ఒక్కొక్కళ్ళకి ఒక్కోరకం ఇబ్బందులు వచ్చి ఉంటాయి.అవన్నీ దాటుకుని వచ్చాము కదా!ఉన్నంతలో సంతోషంగా ఉందాము,సంతోషాన్ని పంచుదాము,పెంచుదాము.

Saturday, October 19, 2024

చద్దెన్నము తిన్న ఇల్లాలు

చద్దెన్నము తిన్న ఇల్లాలికి మొగుడు ఆకలి తెలియదంటారు.మొగుడి ఆకలి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా బిడ్డల ఆకలి తెలుస్తుంది.శబరి ఏమీ చేసింది?తను రాముడికి సమర్పించాలి అనుకున్న పళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని కొరికి చూసింది.ఇంట్లో మన అమ్మ కూడా అలాగే అన్ని చూసుకుని చేస్తుంది.ఇంత పనులు చెయ్యాలంటే శక్తి ఉండాలి కదా ఒంట్లో.మరి ఏమీ తినకపోతే,పొద్దున లేచి ఒంట్లోకి శక్తి ఎట్లా వస్తుంది?నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను.మొదట మీరు తినండి.తరువాత ఇంట్లో వాళ్ళకు పెట్టండి అని.ఇట్లా చేస్తే రెండు లాభాలు మనకు.ఉప్పులు కారాలు సరిగ్గా పడ్డాయో లేదో తెలుస్తుంది.రెండోది ఏంటంటే,ఇంట్లో వాళ్లకి మంచిగా,ఓపికగా,సంతోషంగా పెట్టగలతాము భోజనం.లేకపోతే నీరసానికి,ఆకలికి చేసే పని మీద సరైన ధ్యాస ఉండదు.ఊరికినే ఇంట్లో వాళ్ళను విసుక్కుంటూ,కసురుకుంటూ వుంటాము.లేకపోతే చెయ్యలేక కళ్ళలో నీళ్ళు కుక్కుకుంటూ వుంటాము.ఇవన్నీ అంత అవసరమా?మనము ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళ బాగోగులు పట్టించుకోగలము.కాబట్టి మంచిగా పొద్దున అల్పాహారం తీసుకోండి.ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళకు అన్నాలు పెట్టడానికి చాలా ఓపిక,సహనం కావాలి.ఆకలి పైన అవి పక్కకు వెళ్ళిపోతాయి.విసుకు,కోపం వస్తుంటాయి.కాబట్టి ఒక ముద్ద మీరు ముందు తిని,తరువాత వాళ్ళకు పెట్టండి.అయ్యో!ఇంట్లో వాళ్లందరూ తినకుండా మనమెట్లా తింటాము అని ఆలోచించవద్దు.అందరి మంచికోసమే నేను చెప్పేది.

Thursday, October 17, 2024

సహనం సహజ గుణం గా…..

మనకు కోపాలు తాపాలు అన్నీ ఎక్కువే.కానీ చాలా సార్లు జీవితంలో చాలా పోగొట్టుకుంటుంటాము.అందుకనే పెద్దలు నిలిచి నిదానంగా పోవాలి అని అంటారు.నిజమే!ఎందుకంటే సీతా దేవి అంతటి ఆమే రావణుడు తీసుకెళితే,తొందరపడి అఘాయిత్యం చేసుకోలేదు.ఓపికగా రాముడు కోసం ఎదురుచూసింది.దైవాంశ సంభూతులు అయినవాళ్ళే కష్టాలు పడ్డారు.సహనంతో కష్టాలనుండి బయటపడ్డారు.ఇక మనమెంత?మనం తీసుకునే ప్రతి పెద్ద అడుగు ఆచి తూచి,పూర్వాపరాలు తెలుసుకుని,పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు అడుగు వెయ్యాలి.ముందర మనలను మనం సరిగ్గా అంచనా వేసుకోవాలి.ఎదుటివాళ్ళు వాళ్ళ స్వలాభాలకోసం చాలా సార్లు నువ్వు ఇంద్రుడివి,చంద్రుడివి,తోపువి అని ఆకాశం కి ఎత్తేస్తుంటారు.అవన్నీ నిజం అని నమ్మకూడదు.మన పాదాలు ఎప్పుడూ నేల పైనే ఉండాలి,ఆకాశం లో కాదు.సంయమనం పాటించాలి.అలా ఉండాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.చెప్పుడు మాటలు వినకూడదు.మన తాహతు మనకు తెలియాలి.మన బలాలు ఒక్కటే కాదు,మన బలహీనతలు కూడా ఖచ్చితంగా తెలియాలి.వాటిని ఎదుటివాడు ఒడిసి పట్టుకోకుండా జాగ్రత్త పడాలి.జీవితం అంటే ఒక రకంగా యుద్ధమే.ఊరికినే కత్తి తీసి కనిపించినవాడిని పొడవటం కాదు.బుర్ర పెట్టి ఆలోచించాలి.మనం ఏమి చేస్తే,ఎలా చేస్తే,ఎప్పుడు చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే అవగాహన మనకు ఉండాలి.ఊరికే వాళ్ళు చెప్పారు,వీళ్లు చెప్పారు,నాకు సరిగ్గా అర్థం కాలేదు పరిస్థితి అని తరువాత మనల్ని మనం సమర్థించుకోకూడదు.ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం చేసే పనులకు మనమే బాధ్యులం కదా!

Wednesday, October 16, 2024

పొద్దున మనము లేవాలి…

పొద్దున మనమూ లేవాలి,పళ్ళను బాగా తోమాలి అని పిల్లలకు నేర్పిస్తాము.ఎర్లీ టు రైజ్ అండ్ ఎర్లీ టు బెడ్ అని వింటుంటాము.ఇది నిజంగా చాలా మంచి అలవాటు.కానీ పిల్లలకు చెప్తాము కానీ,చాలా సార్లు పెద్దవాళ్ళము పాటించము.సూర్యోదయం ముందర లేవాలి.అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.తెల్లవారితే వుండే రణగొణ ధ్వనులు ఉండవు.గాలి కూడా చాలా మటుకు శుభ్రంగా,పొల్యూషన్ లేకుండా ఉంటుంది.మార్నింగ్ వాక్ చేసుకునే వాళ్ళు సంతోషంగా,స్థిమితంగా చేసుకోవచ్చు.అదే అర్ధరాత్రి దాకా మేలుకుని,అపరాహ్ణం లేస్తే ఎలా ఉంటుంది?ఇంట్లో వాళ్ళు ఇంకా లెయ్యలేదని విసుక్కుంటూ ఉంటారు.ఆ ఛీదరలు,చీత్కారాలు వింటూ లెయ్యాలి.ఆలస్యంగా లేస్తాము కాబట్టి కడుపులో జఠరాగ్ని ఎక్కువ అవుతుంది.అలా ఉన్నప్పుడు పళ్లు తోముకున్నా,కడుపులో దేవుతుంది.ఒక్కొక్కసారి నోట్లోకి కూడా వస్తుంది.పళ్ళు మళ్ళా తోముకుందాములే,ముందర కడుపులోకి ఏమన్నా తినేద్దాము అనుకునే వర్గం కూడా ఉంటుంది.ఇంక హడావుడిగా అన్నిటికీ ఉరుకులు పరుగులు పెడుతుండాలి.అదే పొద్దునే లేస్తే,అన్ని పనులు సక్రమంగా,సజావుగా,ప్రశాంతంగా జరుగుతాయి.ఎవరూ మనల్ని విసుక్కోరు,కసురుకోరు,ఈసడించుకోరు,తక్కువ చేసి మాట్లాడరు ఆలశ్యంగా వచ్చామని,పని సరిగ్గా చెయ్యలేదని.కాబట్టి రోజు అంతా సామరస్యంగా జరిగిపోతుంది.పొద్దున్నే లెయ్యాలి అంటే రాత్రిళ్ళు త్వరగా పడుకోవాలి.దేనికైనా క్రమశిక్షణ ఉండాలి.క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేము.మనం చేరుకోవాల్సిన గమ్యం దగ్గరలో ఉన్నా చెయ్యి జారిపోతుంది జీవితంలో క్రమశిక్షణ లేకపోతే.

Tuesday, October 15, 2024

ఏక భుక్తం భూశయనం

మా చిన్నప్పుడు మా బాబు(నాన్న)ఎప్పుడూ చెప్పేవాడు.బ్రహ్మచర్యం నిష్టగా పాటించేవాళ్ళు ఏకభుక్తం భూశయనం తప్పకుండా ఆచరించాలిఅని.పెళ్ళి కాని వాళ్ళు చదువుకునే వాళ్ళు తాంబూలం వేసుకోకూడదు అని.ఏమీ లేదు.సుగంథ ద్రవ్యాలు వాడకూడదు అని.నాలుక మొద్దుబారిపోతుంది.ఉచ్ఛారణ సరిగ్గా వుండదు అని.ఏక భుక్తం అంటే ఒంటి పూట భోజనం అని అర్థం.భూశయనం అంటే పరుపులు అవి లేకుండా కటిక నేల పైన పండుకోవాలి.ఇలా కఠినంగా,క్రమశిక్షణగా వుంటేగానీ చదువు వంట పట్టదని పెద్దల నమ్మకం. ఇప్పుడు అలాంటి పద్థతులు లేవు,ఎవరూ పాటించరు. ఏక భుక్తం అంటే సుమారు ఈ రోజు మథ్యాహ్నం భోజనం చేస్తే ,మళ్ళీ రేపు అన్నం తినేదాక ఏమీ తినకూడదు అని.అంటే ఒక్కపొద్దు వున్నట్లే కదా! ఇప్పుడు చాలా మంది అది పాటిస్తున్నారు కొంచెం మార్పులు చేర్పులతో.16 గంటల ఫాస్టింగ్ అంటారు.8గంటలు ఏమైనా తినవచ్చు,ఎంతైనా తినవచ్చు.కానీ ఆఖరున తిన్నప్పటినుంచి 16 గంటలు ఏమీ తినకూడదు. ఇంకా కొంతమంది కొన్ని రోజులు అనుకుని నీళ్ళు మటుకే తాగుతారు.ఒక్క పొద్దు వుండటం ఒంటికి మంచిది అని తెలుసుకున్నారన్న మాట.మన పెద్దలు చెప్తారు కదా...లంఖణం దివ్యౌషథం అని. వీపు పట్టుకున్నా,మెడ పట్టుకున్నా,నడుము పట్టుకున్నా,నేల పైన పండుకుంటే తగ్గుతాయి కదా.అంటే భూశయనం మంచిదే కదా!!!

జిహ్వచాపల్యం…..అవసరమా?

ఇంట్లో అమ్మలు,అమ్మమ్మలు,అత్తలు,నానమ్మలు వుండి పూట పూటకు రుచులు రుచులుగా చేసి పెడుతుంటే,ప్రతి ఒక్కరికీ జిహ్వ చాపల్యం ఉండి తీరాల్సిందే.కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగ లేవు చాలా ఇండ్లలో.అప్పుడు పరిస్థితి ఏంది?క్షణాల్లో పొద్దున టిఫిన్ అయిపోవాలి,కడుపులోకి కూడా పోవాలి.మధ్యాహ్నం లంచ్ కి గబ గబా ఏదో ఒకటి కుక్కుకుని,మళ్ళీ సీట్ లోకి వెళ్లి పని చూసుకోవాలి.ఈ పరిస్థితులలో రుచులకు చోటు ఏది?మన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారు.మంచి పరిణామం.నథింగ్ వైట్ అనే ఉద్యమం బాగా నడుస్తుంది.అంటే పాలు,చక్కెర,పిండి పదార్థాలు,బియ్యం లాంటివి వద్దు అని.ఇంకో వర్గం నూనెలు వద్దు,కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే కష్టం అంటుంది.ఇవన్నీ తప్పని కాదు కానీ మరీ భయపడి ఎండుకు పోకూడదు కదా. ఇప్పుడు చద్దెన్నాలు తినేవాళ్లు లేరు.ఇడ్లీ దోసెలు వీకెండ్ కి జరిగిపోయాయి చాలా మంది ఇండ్లలో.రాగి జావ,గ్రిట్స్,ఓట్స్,ఫ్రూట్స్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. రుచులు రుచులుగా చేస్తే ఒకటి తినాల్సింది నాలుగు తింటాము.ఉప్పు వేస్తే బీపీ అంటాము.చక్కెర వేస్తే షుగర్ అంటాం.కారం వేస్తే కడుపులో మంట అంటాము.అయితే ఇప్పుడు ఎలా? అందుకనే ప్రతిదీ చిన్నప్పటి నుంచీ మితంగా తీసుకుంటే, చాలా ఆరోగ్య సమస్యలు నుండి బయట పడవచ్చు.ఇంకో రెండు ముద్దలు తింటే కడుపు నిండుతుంది అంటే,ఇప్పుడే ఆపెయ్యాలి.చిన్నప్పుడు మా బాబు(నాన్న)చెప్పేవాడు.కడుపులో సగం అన్నం ఉండాలి.పావు భాగం నీళ్లు ఉండాలి.మిగిలిన పావు భాగం కాళీగా ఉండాలి.రుచిగా తినకూడదు అని కాదుకానీ,ఆరోగ్యం పట్ల కూడా అవగాహన పెంచుకుంటే బాగుంటుందిమనందరమూ.