Thursday, October 17, 2024

సహనం సహజ గుణం గా…..

మనకు కోపాలు తాపాలు అన్నీ ఎక్కువే.కానీ చాలా సార్లు జీవితంలో చాలా పోగొట్టుకుంటుంటాము.అందుకనే పెద్దలు నిలిచి నిదానంగా పోవాలి అని అంటారు.నిజమే!ఎందుకంటే సీతా దేవి అంతటి ఆమే రావణుడు తీసుకెళితే,తొందరపడి అఘాయిత్యం చేసుకోలేదు.ఓపికగా రాముడు కోసం ఎదురుచూసింది.దైవాంశ సంభూతులు అయినవాళ్ళే కష్టాలు పడ్డారు.సహనంతో కష్టాలనుండి బయటపడ్డారు.ఇక మనమెంత?మనం తీసుకునే ప్రతి పెద్ద అడుగు ఆచి తూచి,పూర్వాపరాలు తెలుసుకుని,పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు అడుగు వెయ్యాలి.ముందర మనలను మనం సరిగ్గా అంచనా వేసుకోవాలి.ఎదుటివాళ్ళు వాళ్ళ స్వలాభాలకోసం చాలా సార్లు నువ్వు ఇంద్రుడివి,చంద్రుడివి,తోపువి అని ఆకాశం కి ఎత్తేస్తుంటారు.అవన్నీ నిజం అని నమ్మకూడదు.మన పాదాలు ఎప్పుడూ నేల పైనే ఉండాలి,ఆకాశం లో కాదు.సంయమనం పాటించాలి.అలా ఉండాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.చెప్పుడు మాటలు వినకూడదు.మన తాహతు మనకు తెలియాలి.మన బలాలు ఒక్కటే కాదు,మన బలహీనతలు కూడా ఖచ్చితంగా తెలియాలి.వాటిని ఎదుటివాడు ఒడిసి పట్టుకోకుండా జాగ్రత్త పడాలి.జీవితం అంటే ఒక రకంగా యుద్ధమే.ఊరికినే కత్తి తీసి కనిపించినవాడిని పొడవటం కాదు.బుర్ర పెట్టి ఆలోచించాలి.మనం ఏమి చేస్తే,ఎలా చేస్తే,ఎప్పుడు చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే అవగాహన మనకు ఉండాలి.ఊరికే వాళ్ళు చెప్పారు,వీళ్లు చెప్పారు,నాకు సరిగ్గా అర్థం కాలేదు పరిస్థితి అని తరువాత మనల్ని మనం సమర్థించుకోకూడదు.ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం చేసే పనులకు మనమే బాధ్యులం కదా!

No comments: