Tuesday, November 12, 2024
ఎండమావులు
మనకు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండేది అక్కరలేదు.దొరకని దానికోసం ఉరుకుతూ ఉంటాము.ఎవడో చెప్పాడని,ఒంటిపైన గుడ్డలు కూడా చూసుకోకుండా పరుగులు తీస్తాము.దూరం నుంచి చూస్తే అంతా సుందరంగా,సులభంగా,లాభసాటిగా కనిపిస్తుంది.అందుకే కదా దూరపు కొండలు నునుపు అనేది.చాలా సులువుగా కోట్లు సంపాదించవచ్చని,సులువైన మార్గాలు చెప్తారు.అర చేతిలో స్వర్గం చూపిస్తారు.అన్నీ నమ్మేస్తాము.అందుకే వాళ్ళు మనల్ని ఎంచుకుంటారు.వాళ్ళు చెప్పినట్లు దిగి,పెట్టుబడులు పెడతాము.మనం అనుకున్నట్లు లాభాలు రావు.అదేంది అంటే,ఇంకొంచెం సర్దుకోమంటారు.అదిగదిగో సందు తిరిగితే నోట్ల కట్టలే కట్టలు అంటారు.అగమ్యగోచరం అవుతుంది.ఫలితాలు కనుచూపు మేరలో కానరావు.డీలా పడిపోతాము.కానీ ఇంకా ఊదర కొడతారు.ఇంకెంతో దూరం లేదు ధనలక్ష్మి నీ ఇంటి తలుపు తట్టేదానికి అంటూ ఏడు రంగుల ఇంద్రధనుస్సు చూపిస్తారు.కానీ అది దక్కాలంటే ఇంకొంచెం పెట్టుబడి పెట్టాలి అంటారు.అలా అంతులేని కథ లాగా సాగిపోతుంది.నీ దగ్గర నుంచి ఆఖరి పైసా కూడా లాగేసిన తర్వాత నిన్ను దీంట్లో దించినవాళ్లు అదృశ్యమయిపోతారు.కనిపించరు,వినిపించరు.అందుకనే ఎండమావుల వెంట పరుగెత్తకూడదు.అల్లంత దూరంలోనే నీటి చెలమ ఉన్నట్లు భ్రమకలిగిస్తూ ఉంటుంది.కానీ అక్కడ నీరే ఉండదు.అక్కడ నుంచి చూస్తే ఇంకొంత దూరంలో అసలు సిసలైన నీటి జాడ ఉన్నట్లు అనిపిస్తుంది.అంటే ఆ భ్రమలో నుంచి బయటపడితేగాని,మనకు అసలు పరిస్థితి అర్థం కాదు.కాబట్టి మన బలాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో,మన బలహీనతలు తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం.లేకపోతే అవకాశవాదులు మనకు లేనిపోని ఆశలు చూపించి,బురిడీ కొట్టిస్తారు.మన జాగ్రత్తలో మనం ఉండాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment