Wednesday, November 6, 2024

అన్నం పరబ్రహ్మ స్వరూపం

మన పెద్దవాళ్ళు అందరూ చెబుతుంటారు.అన్నం పారేయకూడదు.అన్నం దేవుడితో సమానం అని.నిజం!ఒక ముద్ద దొరకాలంటే ఎంత కష్టపడాలి?అలాంటప్పుడు దుబారా చేయకూడదు.కానీ చాలా సార్లు పరిస్థితులు అలా ఉండవు.నలుగురు పిల్లలు వుండే ఇంట్లో గొంతు పిసికినట్లుగా సరిగ్గా చేయలేము.ఒక ముద్ద ఎక్కువే వండాలి.అట్లా వండిన ప్రతిసారి అన్నం మిగులుతుంది.అలాగని సరిగ్గా చేసాము అంటే ఆ రోజు అన్నం అందరికీ చాలదు.చాలా మంది,ముఖ్యంగా ఆడవాళ్లు అన్నం మిగిలింది పాడు చేయటం ఎందుకని బలవంతంగా తింటుంటారు.ఇది అసలు మంచిది కాదు.మా బాబు(నాన్న)అసలు ఒప్పుకునేవాడు కాదు.ఉడకబెట్టేవి తొందరగా చెడిపోతాయి.అవి కడుపులో కంటే బయట ఉండటం మేలు అనేవాడు.అంతే కదా!మిగిలింది అని తినటం మొదలుపెడితే ఊబకాయం వస్తుంది కదా.ఒక్కొక్కసారి అన్నం,సాదకాలు వేడి చేసుకుని తింటుంటాము.ఆ వేడి పైన నిజంగా చెడిపోతే చాలా సార్లు తెలియదు.అది వంటికి మంచిది కాదు కదా.పాత రోజుల్లో అయితే అంతో ఇంతో మిగిలితే వీధి కుక్కలకు,కాకులకు పెట్టేవాళ్లము.పని వాళ్ళకు,పేదవాళ్ళకు ఇచ్చేవాళ్ళము.కానీ ఇప్పుడు అలాంటివి చాలా తగ్గిపోయాయి.మనం వండుకుంది మనమే తినాలి,లేకపోతే పారెయ్యాలి.ఇలాంటి పరిస్థితుల్లో మట్టసంగా చేసుకోవడమే ఉత్తమం.అర్ధాకలితో కంచం ముందర నుంచి లేస్తేనే వంటికి మంచిది.కాబట్టి మిగిలింది అని,దుబారా అవుతుందని,చెడిపోతుంది అని బలవంతంగా తినొద్దు.కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకుంటాము.

No comments: