Monday, April 27, 2020

కరోనా వేళ...అలసత్త్వమేల?

మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎండాకాలం సెలవలకు వెళ్ళాము.పిల్లలకు అమ్మవారు వచ్చింది.ఆ సమయంలోనే మా మామ వాళ్ళనెలల బిడ్డను కూడా తీసుకుని వేరే ఊరి నుంచి వచ్చాడు.మా అమ్మమ్మ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా మా చినతాత వాళ్ళ యింట్లో వుంచింది.పాత రోజుల్లోనే మన వాళ్ళు అంటువ్యాధులు అంటే అన్నిజాగ్రత్తలు తీసుకునే వాళ్ళు.బయటనుంచి వస్తే కాళ్ళూచేతులు కడుక్కోవాలి.బడి నుంచి వస్తే బట్టలు మార్చాలి.మా అమ్మ మాకు బాగా లేకపోతే మమ్మల్ని నిమురుతూ లక్ష్మీనరసింహ!లక్ష్మీనరసింహ!అని అంటుండేది.అంటే మనకు ధైర్యం చెప్పటంఅన్నమాట మౌనంగా.పల్లెటూరి వాళ్ళు,చదువురానివాళ్ళు,పాతకాలంవాళ్ళు,పనికిరానివాళ్ళు అంటుంటాము.కనీసం వాళ్ళకుండే అవగాహన,వాళ్ళకుండే జాగ్రత్త,వాళ్ళు పాటించే శుభ్రత,వాళ్ళు రోగికి ఇచ్చే మానసిక థైర్యం మనకు లేవా?మనం పాటించలేమా?మనంఇవన్నీ పాటించాలంటే ప్రభుత్వం లాక్ డౌను పెట్టాలా?పోలీసులు లాఠీలు ఝళిపించాలా?వైద్యులు ఇంట్లోనే వుండండి,శుభ్రంగా వుండండి అని కాళ్ళా వేళ్ళా బతిమలాడుకోవాలా?మనం సంఘ జీవులం కాదా?ఈ సంఘంలో బతకడంలేదా?వేరే గ్రహం నుంచి ఊడి పడ్డామా?ఒక సారి చెపితే అర్ధంకాదా?మనంఆరోగ్య పరమైన జాగ్రత్తలు పాటిస్తూ పక్క వాళ్ళకు అవగాహన కలిపించలేమా?ప్రభుత్వం విధించే నిబంధనలు మామూలు ప్రజానీకానికి మనకు కాదు అని ఎవరికి వాళ్ళు అనుకోవద్దు.మన జాగ్రత్తే మనకు మన చుట్టూ ఉండే వాళ్ళకూ శ్రీరామ రక్ష,.

No comments: