Friday, November 22, 2024

స్నేహమంటే ఇలాగుండాలి

మా చిన్నప్పుడు మా బాబు(నాన్న) చెప్పేవాడు స్నేహమంటే ఎలాగుండాలి అని.మనకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు.పెద్ద అయిన తరువాత ఒకడు చాలా గొప్పవాడు అవుతాడు.ఇంకొకడు బీదవాడు అవుతాడు.ఇద్దరూ ఒకేసారి ఇంటికి వస్తారు.అప్పుడు ఇద్దరికీ ఎదురెళ్ళి ఇంట్లోకి పిలుచుకుని వెళ్ళాలి.బీదవాడిని కుడివైపు కూర్చోపెట్టుకోవాలి,గొప్పవాడిని ఎడమ వైపు కూర్చోపెట్టుకోవాలి.ఎందుకంటే బీదవాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ తనను తక్కువగా చూస్తున్నాము అని బాధ పడకూడదు.పొరపాటున మనము ఎడమవైపు కూర్చోపెట్టుకుంటే,నేను అర్థబలం,అంగబలం లేని వాడిని కాబట్టి నన్ను ఎడమ వైపు కూర్చోపెట్టుకున్నాడు అని బాధపడకూడదు.ఇద్దరినీ అంత సమానంగా చూసుకోవాలి.ఎవరి మనసూ కష్టపెట్టకూడదు.స్నేహానికి కృష్ణుడు పెట్టింది పేరు.కుచేలుడుతో తన స్నేహం ఎంత మధురమైనది కదా!తను భగవంతుడు.అయినా అర్జునుడితో స్నేహం ఎంత సుందరంగా ఉంటుంది కదా!ఆఖరికి తన మిత్రుడి కోసం రథ సారథి కూడా అవుతాడు కదా!స్నేహమనేది ఈ సృష్టిలో చాలా అద్భుతమయిన బంధం.దానిని ఎలాంటివారు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడగొట్టుకోకూడదు.

శని గ్రహా రక్షించు ఈ దంపతులను

మా అమ్మ మా చిన్నప్పుడు ఈ పాటను చిన్నగా పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేది.మా అమ్మ దేవుడి దగ్గర దీపారాధన చేసి,రెండు శ్లోకాలు చెప్పుకుని లేచేసేది.ఇంకా దేవుడి పాటలు సన్నగా వినిపించీ వినిపించకుండా పాడుకుంటూ పనులు చేసుకునేది.మా బాబు(నాన్న)స్నానం చేసి భగవద్గీత చదువుకునే వాడు.అంతా సులభంగా అయిపోయేది.మాకు అయితే ఆ పాట ఇలా అనిపించేది,వినిపించేది.శనిగ్రహా రక్షించు ఈ ఢంకా శూలాన్ని అని.మేము బాగా పెద్ద అయిన తరువాత చెప్పింది మా అమ్మ దంపతులను అనేది సరైన పదం అని.చాలా మంది కఠోరమయిన పూజలు,పద్ధతులు పాటిస్తూ వుంటారు.ఒక్కపొద్దులు రోజుల తరబడి,నెలల తరబడి చేస్తుంటారు.కానీ ఇది సరైన పద్ధతి కాదు అని నా అభిప్రాయం.మా పెద్దత్త చెబుతూ ఉండేది.సంసారం చేసుకునే వాళ్ళు కఠినమయిన,కఠోరమయిన పూజలు చేయకూడదు అని.నిజమే కదా.సంసారాలలో చిన్న బిడ్డలు ఉంటారు.పెద్దవారూ ఉంటారు.వాళ్ళ అవసరాలు ముఖ్యం కదా.భక్తి ముఖ్యం,నమ్మకం ముఖ్యం.మనం ఎంతసేపు పూజలు చేశాము,ఎంత ఆర్భాటంగా చేశాము,ఎంత కఠినమయిన నియమాలు పాటించామని కాదు కదా.ఇలా అంతా ఆలోచించకూడదనే....పత్రం,పుష్పం,ఫలం,తోయం అని అన్నారు.అంటే నిజమైన భక్తిశ్రద్ధలతో ఒక ఆకు సమర్పించినా,ఒక పుష్పం,ఒక పండు సమర్పించినా చాలు.ఆఖరికి ఒక ఉద్ధరిణతో నీళ్ళు దేవుడి పైన చిలకరించినా చాలు.కాబట్టి మనం మంచిగా,భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకుందాము.ఆర్భాటాలు,గొప్పలు కోసం కాకుండా మన కోసం మనం ప్రవర్తిస్తాము.

Monday, November 18, 2024

రోమన్ ఇన్ రోమ్?

బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అని అంటారు కదా చాలా మంది చాలా సార్లు.నిజంగా అది కుదురుతుందా?నాకు అయితే కష్టం అనిపిస్తుంది.వేరే కొత్త చోటుకి వెళ్ళి,అక్కడ సంస్కృతి,సాంప్రదాయాలు,వేషభాషలు,నడత,పలుకు అన్నీ ఒక్క క్షణంలో నేర్చుకోలేము కదా.మనల్ని చూడగానే అర్థం అవుతుంది కదా మనం అక్కడకు కొత్త అని.అవసరానికి నేర్చుకోవడం,అలవాటు చేసుకోవటం వేరు.మనసు ఒప్పి అవి పాటించడం వేరు.మన మూలాలు ఎక్కడ ఉన్నాయో వాటికే మనం ప్రాధాన్యత ఇస్తాము.ఇన్ ది స్ట్రగుల్ ఫర్ ఎక్సిస్టెన్స్,సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే డార్విన్ థియరీ ప్రకారం అయితే మారాలి,మారగలగాలి.ఇక్కడ వేషభాషలు కంటే కూడా అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకోకూడదు కొత్త చోటుకి మనం వెళ్ళినప్పుడు అని అర్థం.ఎందుకంటే మనమే కొత్త అయినప్పుడు మనల్ని సమర్థించేవాళ్ళు,అయ్యోపాపం అనేవాళ్ళు ఎవరూ ఉండరు.కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి.సమస్యలకు దూరంగా ఉండాలి.సర్దుబాటు ధోరణిలో ఉండాలి.తెలియని వాటి జోలికి వెళ్ళకూడదు.మా అన్నయ్య ఎప్పుడూ చెప్పేవాడు...నో వన్ ఇస్ వర్త్ బిలీవింగ్ అని.ఇక్కడ చెడు అర్థం కాదు.మన పరిథిలో మనం ఉండాలి.ఎవరినీ అతిగా నమ్మకూడదు.అతిగా నమ్మితే మోసపోవటం,అన్యాయమై పోవటం చాలా సామాన్యం.మనకూ దేవుడు బుర్ర ఇచ్చాడు.దానిని వాడుతూ ఉండాలి.ఊరికినే ఎదుటివారు చెప్పింది అంతా మూర్ఖంగా నమ్మకూడదు.మనం బేరీజు వేసుకుని,అడుగుముందుకు వెయ్యాలి.ఘర్షణలు అవసరం లేదు.మనకు పరిస్థితి సానుకూలం కాదు అని తెలియగానే,చిన్నగా అక్కడనుంచి తప్పుకుంటే మంచిది.ఉండేకొద్దీ అక్కడ అలవాట్లు,వేషభాషలు సునాయాసంగా వచ్చేస్తాయి.అక్కడ మనకు ఎదురయ్యే లోటుపాట్లు అవగాహనకు వస్తాయి.వాటినుండి బయటపడటం లేకపోతే దూరంగా ఉండటం ఎలాగో అర్థం అవుతుంది.

Saturday, November 16, 2024

నాగుపాము డాన్స్-నత్తగుల్ల స్టాన్స్

నేను చిన్నప్పుడు నాగుపాము డాన్స్ చేసేదాన్ని.రకరకాల కఠినమయిన విన్యాసాలుతో కూడి ఉండేది.అప్పట్లో సునాయాసంగా చేసేదాన్ని.ఇప్పుడు కదులుతున్నాను అనుకుంటాను,కానీ ఎక్కడికక్కడే ఉండిపోతాను.నాకంటే నత్తగుల్ల నయం.అది కనీసం అరగంటకు అయినా ఒక అంగుళం కదులుతుంది.నేను మెట్లు దిగటం మా పిల్లలు చూపిస్తుంటారు.అందరం పగలబడి నవ్వుకుంటాము.జీవితం అంతే కదా!చిన్నతనంలో ఇక్కడ అడుగేస్తే అక్కడ తేలుతాము.ఎంతసేపు ఆటలు,పాటలు,మాటలు,డాన్సులు,డ్రామాలు...ఒకటి కాదు సవాలక్ష!చిన్నగా మనకే తెలియకుండా పెద్దవాళ్ళము అవుతాము.ఆటలు,పాటలు అసలు ఎప్పుడో దూరం అయిపోతాయి.జీవితంలో తగిలే ఎదురు దెబ్బలకు,క్లిష్ట పరిస్థితులకు చాలా సార్లు నవ్వటం మర్చిపోతాము.నిద్రలేని రాత్రులు మిగులుతాయి.చిన్నగా గొడవలు,ఘర్షణలు మానేస్తాము.అంతర్ముఖులం అవుతాము.గలగలమని మాట్లాడేవాళ్ళము గప్ చుప్ అయిపోతాము.మౌనం అర్ధంగీకారం అనుకుంటారు ఎదుటివాళ్ళు.కానీ ఏమి మాట్లాడినా వ్యర్థమే అని మౌనం ఆశ్రయిస్తాము.భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం అలవాటు చేసుకుంటాము అని అనుకుంటాము.కానీ ఆటుపోట్లతో ముఖంలో భావాలు బయటపడవు.నిర్వికారంగా తయారు అవుతుంది ముఖం.కానీ మనం నవరాత్రిలో నాగేశ్వరరావు లాగా నవరసాలు చిలికిస్తున్నాము అనుకుంటాము.చిన్నప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా అంటే అంత ఎత్తుకు ఎగిరి గొడవ పెట్టుకుంటాము.ఇప్పుడు మనల్ని చూసి ఎవరైనా ఎక్కిరిస్తే వాళ్ళకంటే ముందు మనమే నవ్వుతాము.ఎందుకంటే వాళ్ళు అనేదాంట్లో నిజం ఉందని గ్రహిస్తాము కనుక.ఒకప్పుడు చక్రం తిప్పాము.ఇప్పుడు పిల్లలు చక్రాల బండిలో తిప్పుతున్నారు.కాబట్టి ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదిస్తాము.కష్టపడినన్ని రోజులు కష్టపడ్డాము.ఇప్పుడు పిల్లలు మనల్ని కష్టపడకుండా చూసుకుంటున్నారు.సంతోషంగా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాము.

Tuesday, November 12, 2024

ఎండమావులు

మనకు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండేది అక్కరలేదు.దొరకని దానికోసం ఉరుకుతూ ఉంటాము.ఎవడో చెప్పాడని,ఒంటిపైన గుడ్డలు కూడా చూసుకోకుండా పరుగులు తీస్తాము.దూరం నుంచి చూస్తే అంతా సుందరంగా,సులభంగా,లాభసాటిగా కనిపిస్తుంది.అందుకే కదా దూరపు కొండలు నునుపు అనేది.చాలా సులువుగా కోట్లు సంపాదించవచ్చని,సులువైన మార్గాలు చెప్తారు.అర చేతిలో స్వర్గం చూపిస్తారు.అన్నీ నమ్మేస్తాము.అందుకే వాళ్ళు మనల్ని ఎంచుకుంటారు.వాళ్ళు చెప్పినట్లు దిగి,పెట్టుబడులు పెడతాము.మనం అనుకున్నట్లు లాభాలు రావు.అదేంది అంటే,ఇంకొంచెం సర్దుకోమంటారు.అదిగదిగో సందు తిరిగితే నోట్ల కట్టలే కట్టలు అంటారు.అగమ్యగోచరం అవుతుంది.ఫలితాలు కనుచూపు మేరలో కానరావు.డీలా పడిపోతాము.కానీ ఇంకా ఊదర కొడతారు.ఇంకెంతో దూరం లేదు ధనలక్ష్మి నీ ఇంటి తలుపు తట్టేదానికి అంటూ ఏడు రంగుల ఇంద్రధనుస్సు చూపిస్తారు.కానీ అది దక్కాలంటే ఇంకొంచెం పెట్టుబడి పెట్టాలి అంటారు.అలా అంతులేని కథ లాగా సాగిపోతుంది.నీ దగ్గర నుంచి ఆఖరి పైసా కూడా లాగేసిన తర్వాత నిన్ను దీంట్లో దించినవాళ్లు అదృశ్యమయిపోతారు.కనిపించరు,వినిపించరు.అందుకనే ఎండమావుల వెంట పరుగెత్తకూడదు.అల్లంత దూరంలోనే నీటి చెలమ ఉన్నట్లు భ్రమకలిగిస్తూ ఉంటుంది.కానీ అక్కడ నీరే ఉండదు.అక్కడ నుంచి చూస్తే ఇంకొంత దూరంలో అసలు సిసలైన నీటి జాడ ఉన్నట్లు అనిపిస్తుంది.అంటే ఆ భ్రమలో నుంచి బయటపడితేగాని,మనకు అసలు పరిస్థితి అర్థం కాదు.కాబట్టి మన బలాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో,మన బలహీనతలు తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం.లేకపోతే అవకాశవాదులు మనకు లేనిపోని ఆశలు చూపించి,బురిడీ కొట్టిస్తారు.మన జాగ్రత్తలో మనం ఉండాలి.

Sunday, November 10, 2024

నవ్వులు-పువ్వులు

మనం సంతోషంగా నవ్వుతూ ఉండాలి.మనతో వుండే వాళ్ళు కూడా సంతోషంగా వుండేలా చూసుకోవాలి.అలా ఉంటేనే మన మొహాలు పూలలాగా విరుస్తూ,మెరుస్తూ ఆనందంగా వికసిస్తూ వుంటాయి.కొంత మంది ఉంటారు.ఎప్పుడూ జిట జిటమంటూ,చిట్టెడు వేస్తే పుట్టెడురాలేటట్లు.బిగదీసుకుని ఉంటారు.మొహం చిట్లిచ్చి చిట్లిచ్చి అడ్డంగా నిలువుగా నెర్రెలు పడిపోయి వుంటాయి.ఏమి చేసినా వాళ్ళ మొహంలో ప్రశాంతత,సంతోషం,తృప్తి కనిపించదు.కదిలిస్తే కరుస్తాము అనేటట్లు ఉంటారు.ఇంకొక వర్గం ఎప్పుడూ నెత్తిమీద నీళ్లకుండ పెట్టుకుని ఉంటారు.చిన్నదానికి పెద్దదానికి తేడాలేకుండా ఏడుపు,దుఃఖం వస్తుంటుంది.కొంత మంది నేరుగా అసలు మాట్లాడరు.ఎప్పుడూ కొక్కరింపు,అవహేళన,వ్యంగ్యం,ఈసడించుకుంటూ,గద్దిస్తూ,అరుస్తూ ఉంటారు.ఒక మొక్క పూలను ఎప్పుడు ఇస్తుంది?గాలి,వెలుతురు,నీరు,భూమిలో పోషకాలు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు కదా.అలానే మనం మన మనసులను ప్రశాంతంగా పెట్టుకుని,ఆశావహ దృక్పథంతో,ఎదుటివారిని ప్రేమిస్తే పెదవులపైన చిరునవ్వు వస్తుంది.అలావుంటే పక్కన వాళ్ళు కూడా వాళ్ళకు తెలియకుండానే మనతో స్నేహభావంతో,సరదాగా,ప్రసన్నంగా ఉంటారు.మన దగ్గరకు ఎలాంటి అనుమానాలు,భయాలు లేకుండా హాయిగా రాగలుగుతారు.మన చుట్టూరా వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.మనసు నిండా నవ్వటం ఆరోగ్యానికి కూడా మంచిది.మొహం పైన కండరాలకు కూడా వ్యాయామం ఉంటుంది.కాబట్టి నవ్వుతూఉందాము,నవ్వుల జల్లులతో పువ్వులు పూయిస్తాము.

Thursday, November 7, 2024

చేసిన మేలు మరిచేవారు

చాలా మందికి ఎదుటివాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు అనే స్పృహ ఉండదు.ఇంక గుర్తు పెట్టుకోవటం,గుర్తు పెట్టుకోకపోవటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.మనం పీక్కుంటుంటాము ఇంత సహాయం చేసాము,అంత చేశాము,మనల్ని కన్నెత్తి కూడా చూడటం లేదని.అసలు సహాయం చేయటం,చేయకపోవటం మన నిర్ణయం.అలాంటప్పుడు ఎదుటివాడు గుర్తు పెట్టుకోవాలి,అర్థం చేసుకోవాలి,జీవితాంతం రుణపడి ఉండాలి అని ఆశ పడటం అత్యాశ కదా.మన విషయమే తీసుకుందాము.ఎంత మంది తలా ఒక చెయ్యి వెయ్యకపోతే జీవితంలో ఇంత దూరం వస్తాము?ఎంత మంది వాళ్ళలో మనకు తెలుసు? ఎంత మందికి చెప్పగలతాము?మనకు తెలియకుండా చాలా మంది మనకు సహాయం చేసి ఉంటారు.వాళ్ళకు ఎప్పటికీ చెప్పలేము.జీవితం అంటే పరుగు పందెం కదా!ఎవరైనా కింద పడితే మనం చెయ్యి అందిస్తాము లేవడానికి.లేవగానే వాడు ఆ పరుగు కొనసాగించాలి,కోన సాగిస్తాడు కూడా.ఎవరు చెయ్యి అందిచ్చారు అనేది కూడా చూసుకునే సమయం ఉండదు.మరి అతనిని తప్పు ఎలా పడతాము?వాడు ఆగి, మన గుణగణాలు పొగిడి,ఇంటికి తీసుకెళ్ళి ముప్పూటలా తిండి పెట్టి పంపించడు కదా.వాడికీ కుదరదు,మనకూ కుదరదు.కాబట్టి ఎదుటివాడికి సహాయం చేయటం మన బాధ్యత అనుకోవాలి,చెయ్యాలి,అంతే!ప్రతిఫలాపేక్షతో చేయకూడదు.అసలు అలా ఆలోచించేటట్లయితే అసలు చేయవద్దు.ఎదుటివారికి కూడా క్లారిటీ ఉంటుంది కదా,మన దగ్గరనుంచి సహాయం ఆశించవచ్చా లేదా అని.మన పనులు,ఆలోచనలు క్రియాశీలకంగా ఉండేలా చూసుకుంటే చాలు.ఎదుటివారు మనం చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకున్నా,పెట్టుకోకపోయినా మన ధర్మం మనం నిర్వర్తిస్తాము.

Wednesday, November 6, 2024

అన్నం పరబ్రహ్మ స్వరూపం

మన పెద్దవాళ్ళు అందరూ చెబుతుంటారు.అన్నం పారేయకూడదు.అన్నం దేవుడితో సమానం అని.నిజం!ఒక ముద్ద దొరకాలంటే ఎంత కష్టపడాలి?అలాంటప్పుడు దుబారా చేయకూడదు.కానీ చాలా సార్లు పరిస్థితులు అలా ఉండవు.నలుగురు పిల్లలు వుండే ఇంట్లో గొంతు పిసికినట్లుగా సరిగ్గా చేయలేము.ఒక ముద్ద ఎక్కువే వండాలి.అట్లా వండిన ప్రతిసారి అన్నం మిగులుతుంది.అలాగని సరిగ్గా చేసాము అంటే ఆ రోజు అన్నం అందరికీ చాలదు.చాలా మంది,ముఖ్యంగా ఆడవాళ్లు అన్నం మిగిలింది పాడు చేయటం ఎందుకని బలవంతంగా తింటుంటారు.ఇది అసలు మంచిది కాదు.మా బాబు(నాన్న)అసలు ఒప్పుకునేవాడు కాదు.ఉడకబెట్టేవి తొందరగా చెడిపోతాయి.అవి కడుపులో కంటే బయట ఉండటం మేలు అనేవాడు.అంతే కదా!మిగిలింది అని తినటం మొదలుపెడితే ఊబకాయం వస్తుంది కదా.ఒక్కొక్కసారి అన్నం,సాదకాలు వేడి చేసుకుని తింటుంటాము.ఆ వేడి పైన నిజంగా చెడిపోతే చాలా సార్లు తెలియదు.అది వంటికి మంచిది కాదు కదా.పాత రోజుల్లో అయితే అంతో ఇంతో మిగిలితే వీధి కుక్కలకు,కాకులకు పెట్టేవాళ్లము.పని వాళ్ళకు,పేదవాళ్ళకు ఇచ్చేవాళ్ళము.కానీ ఇప్పుడు అలాంటివి చాలా తగ్గిపోయాయి.మనం వండుకుంది మనమే తినాలి,లేకపోతే పారెయ్యాలి.ఇలాంటి పరిస్థితుల్లో మట్టసంగా చేసుకోవడమే ఉత్తమం.అర్ధాకలితో కంచం ముందర నుంచి లేస్తేనే వంటికి మంచిది.కాబట్టి మిగిలింది అని,దుబారా అవుతుందని,చెడిపోతుంది అని బలవంతంగా తినొద్దు.కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకుంటాము.

Monday, November 4, 2024

అతి వద్దనే వద్దు

పెద్దలు ఏమంటారు?అతి సర్వత్ర వర్జయేత్ అని.ఎలాంటి పరిస్థితుల్లో కూడా అతి వద్దు,మంచిది కాదు అని.కానీ మనం ప్రతి విషయంలోనూ అతి చేస్తుంటాము.పిల్లలపైన అతి ప్రేమలు,ఎదుటివారి పైన అతి కోపాలు సర్వ సాధారణం.మనల్ని మనం సమర్థించుకోవటం అనుకుంటూ గర్వానికి,భేషజానికి పోతుంటాము.ఎప్పుడు అయినా ఒక పందెం అంటే ఎప్పుడూ,ఎక్కడ,ఎలా,ఎవరు పోటీకి అర్హులు అని ఉంటుంది.కానీ పందెం అనగానే ముందుకు దూసుకుపోతాము.ఎంత దాకా పరిగెత్తాలా అని కూడా తెలుసుకోకుండా పరిగేస్తూనే ఉంటాము.మనం తిరిగి చూసేలోపల వేరే వాళ్ళు విజేతలు అయిపోతారు.పరీక్షలలో కూడా ప్రశ్నలు పూర్తిగా చదవము.సగం చదివేసి,అబ్బా!నాకు తెలిసిన జవాబే అని రాయటం మొదలుపెట్టేస్తాము.సగం రాసిన తర్వాత అనుమానం వచ్చి చూసుకుంటే,దాని జవాబు వేరే ఉంటుంది.చాలా మంది పేపర్ తిప్పి కూడా చూడరు.అక్కడ ఇంకో సగం క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇంకో సగం మార్కులకు.ఆ విషయం పరీక్ష హాల్ నుంచి బయటకొచ్చిన తర్వాత కానీ తెలుసుకోము.ఏమీ లేదు,అంతా హడావుడి,హైరానా!మనకే అర్థం కాకుండా ఉరుకులు,పరుగులు.భావోద్వేగాలు విషయం లో కూడా మితంగా వ్యవహరించం.చివరిదాకా పోతాము.అక్కడినుంచి ఇంకెక్కడికి పోవాలో తెలియదు.నోరు జారుతాము,చెయ్యి జాడిస్తాముు.క్షమించమని అడిగేదానికి అహం అడ్డు వస్తుంది.కొన్ని క్షమించలేని తప్పులు చేస్తాము.చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమీ లాభం అంటారు కదా.కాబట్టి కొంచెం నిగ్రహించుకోవాలి.నోటిదురుసు తగ్గించుకోవాలి.మన ప్రేమలు మన బిడ్డలకు ప్రతిబంధకాలు కాకుండా చూసుకోవాలి.కక్షలు,కావేశాలు పెంచుకోకుండా మితంగా,పరిమితంగా మన భావావేశాన్ని అదుపులో పెట్టుకోవాలి.

Sunday, November 3, 2024

దయచేసి క్షమించు

నా ఏడో క్లాస్లో ఒక పాఠం ఉంది,ఆన్ సేయింగ్ ప్లీజ్ బై ఏజీ గార్డినర్.దాంట్లో మనం సఖ్యంగా,సామరస్యంగా ప్లీజ్,థాంక్ యూ,సారీలు చెబితే రోజంతా బాగా గడుస్తోంది అని సారాంశం.నిజమేకదా.పొద్దున కనిపించగానే గుడ్ మార్నింగ్ చెబితే ఎదుటి వాళ్ళు సంతోషిస్తారు.ఏదైనా ఒక సహాయం కావాలంటే మనస్ఫూర్తిగా ప్లీజ్ అని అడిగితే సామాన్యంగా ఎవరూ కాదనరు.ఎదుటి వాళ్ళనుంచి సహాయం పొందినప్పుడు థాంక్స్ చెబితే వాళ్ళు కూడా సంతోషిస్తారు.మన వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలిగినప్పుడు సారీ చెబితే,వాళ్ళు కొంచెం సర్దుకుంటారు.ఇలా చిన్న చిన్న పదాలతో మన చుట్టూవుండే వాతావరణం స్నేహపూర్వకంగా,సద్భావంతో ఉండేలా చేసుకోగలుగుతాము.ఎందుకంటే పొద్దునలేచినప్పటినుంచి మనకు ఎదుటివారితో పని పడుతూవుంటుంది.మనం వారితో మంచిగా ప్రవర్తిస్తే వారు కూడా మనతో మంచిగా ఉంటారు.మనం దురుసుగా ఉంటే వాళ్ళు మనల్ని లెక్క చేయరు.అందరూ మనల్ని దూరం పెడతారు.అందుకని మనందరమూ కలిసి మెలిసి మంచిగా ఉందాము.మనం బాధ పడకూడదు,మనవల్ల ఎదుటివారూ ఇబ్బంది పడకూడదు.

Friday, November 1, 2024

సన్యాస యోగం ఒక యాగం!

మా చిన్నప్పుడు మా బాబు(నాన్న) కోపం వస్తే హిమాలయాలకు వెళ్ళిపోతాను,సన్యాసులలో కలిసిపోతాను అనేవాడు.మేమందరమూ వద్దూ,వద్దూ అని బతిమాలాడేవాళ్ళము.సన్యాసం అనేది కక్ష,శిక్ష కాదు కదా!అన్నీ త్యజించ గలగటం సన్యాసం అంటే.పనులు తప్పించుకునేదానికి,బాధ్యతలు తప్పించుకునేదానికి కాదు సన్యాసం అనేది.సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే,భవ బంధాలకు,రాగద్వేషాలకు అతీతంగా ఉండగలగటం అలవాటు చేసుకోవాలి.సన్యాసం అనేది పవిత్రమయిన యోగం.ఆ దిశగా అడుగులు వెయ్యాలి అనుకుంటే మంచి ఉద్దేశంతో ముందుకు సాగాలి.అంతే కాని కోపాలు,తాపాలు,నిరాశలు,నిస్పృహలు,భయాలు,బాధ్యతలకు భయపడి పారిపోవటం కాదు.ఆ యాగం చేయాలి అంటే నిరంతర కృషి ఉండాలి.

Thursday, October 31, 2024

శుభకార్యాలప్పుడు పిలుపులు

మనం శుభకార్యాలకు చాలా మందిని పిలుస్తుంటాము.ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత గబుక్కున గుర్తు వస్తుంది.మనకు చాలా ముఖ్యమయిన,దగ్గర వాళ్ళను పిలవటం మరిచిపోయామని.వాళ్ళు ఎదురైతే ఏమి సమాధానం చెప్పాలా అని తల పట్టుకుంటాము.చాలా మంది భార్యాభర్తలు ఇద్దరూ పిలిస్తేనే కానీ రారు.ఇప్పుడిప్పుడు కొంచెం ఆ మొండిపట్టు తగ్గుతున్నది.మర్యాదగా అందరూ రండి అని పిలిచి వస్తాము.కానీ కొన్ని చోట్ల పిలిచేవాళ్ళ పక్కన ఒక అతను పుస్తకం పట్టుకుని ఉంటాడు.ఎంత మంది హాజరు అవుతారు మీ ఇంటి నుంచి అని అడిగి రాసుకుంటాడు.వృథా ఖర్చులు తగ్గించడానికి అని తెలిసింది.కొంత మందిని పిలవాలి కాబట్టి పిలుస్తాము.వాళ్ళు వచ్చినా రాకపోయినా మనకు పెద్ద తేడా ఉండదు.సందడి,పండగ వాతావరణం,పది మందికి భోజనాలు పెడితే మంచిది అని పిలుస్తాము.ఒక్కో సారి మనం పిలిచేదానికి వెళ్ళిన చోట వేరే వాళ్ళు ఉంటారు.పిలవకపోతే బాగుండదని మొహమాటానికి పిలుస్తాము.కొంత మందిని అసలు పిలవము కానీ శుభకార్యం జరుగుతుంది అని వస్తారు.మరీ దగ్గర వాళ్ళయితే రాకపోతే ఒప్పుకోము అని బెదిరిస్తాము.ఏది ఏమైనా ఒక కార్యం జరిగినప్పుడు పది మంది కలిస్తేనే బాగుంటుంది,హడావుడి,సంతోషం,నిండుదనం ఉంటుంది.కాబట్టి పిలిచే ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా,వాళ్ళు నిజంగానే రావాలి ఆని పిలిస్తే మంచిది కదా.అన్ని దానాలలోకి అన్నదానం మంచిది కదా.మన లోగిలిలో పది మంది సంతృప్తిగా తిని,అన్నదాతా సుఖీభవ అని దీవిస్తే మనకు సంతోషం,తృప్తిగా ఉంటుంది.అందుకనే నిజంగా పిలుపులు మొదలు పెట్టేముందు అసలు ఉరామరికగా ఎంత మందిని పిలవాలి అని తేల్చుకోవాలి.కాగితం,పెన్ను తీసుకుని మనకు తెలిసిన,ముఖ్యమమయిన వాళ్ల పేర్లు,బంధువుల పేర్లు రాసుకోవాలి.అలా అయితే మఖ్యమయిన వాళ్ళను మర్చిపోయే తప్పు చేయము.ఒక పెద్ద కార్యం అనుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి తప్పొప్పులు జరుగుతుంటాయి.అవి కావాలని చేసేవి కాదు కదా.ఆ హడావుడిలో,పని తొందరలో మర్చిపోతుంటాము.కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి.

Tuesday, October 29, 2024

సమానత్వం పిల్లలతో

సమానత్వం పాటించాలి అని అందరమూ అనుకుంటాము.కానీ నిజంగా సాధ్యమవుతుందా?భీముడు ఎక్కువ తింటాడు కదా!సమానత్వం అని కుంతి అంతే పెట్టదు కదా బిడ్డలకందరికీ.ఇక్కడ సమానం అంటే ఎవరి ఆకలి ఎంతో తెలుసుకుని,వాళ్ళ ఆకలి తీర్చడం.అంతే కానీ తినలేని వాళ్ళకి కుక్కి కుక్కి పెట్టటం కాదు.లేకపోతే మిగిలిన నలుగురు పాండవులు తిన్నంతే పెట్టి భీముడిని అర్థాకలితో కంచం ముందర నుంచి లేపడం కాదు.తరగతి గదిలో ఇరవై మంది పిల్లలుంటే,అందులో నలుగురు మాట్లాడారు నిశ్శబ్దం పాటించకుండా అనుకో.మాస్టర్ కి ఆ నలుగురు ఎవరో తెలియదు కానీ కొంత మంది మాట్లాడుతున్నారు అని తెలుస్తుంది.సమానత్వం అని అందరినీ శిక్షించాడు అంటే తప్పు కదా!తప్పు చెయ్యని వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తున్నారు కదా.కాబట్టి సమానత్వం అని మూర్ఖంగా ఆలోచించకుండా,సమయస్ఫూర్తిగా,స్ఫూర్తిదాయకంగా వ్యవహరించాలి.ఇండ్లలో కూడా చిన్నవాళ్ళు అంటే ఇష్టం,లేక పెద్ద వాళ్ళు అంటే ఇష్టం అమ్మ నాన్నలకు అని పిల్లలు అపోహ పడుతుంటారు చాలా సార్లు.ఒక్కో బిడ్డ మనస్తత్వం,వయసు,అప్పటి పరిస్థితి అన్నీ నిర్ణయిస్తాయి తల్లి తండ్రుల స్పందన ఆ క్షణంలో.ఇంత కంటే ముఖ్యంగా తల్లితండ్రుల మానసిక,వ్యవహారిక పరిస్థితి ఆ సమయంలో చాలా ముఖ్యం.సంతోషంగా ఉన్నారు అనుకో తేలికగా తీసుకుంటారు.అదే చికాకుగా,ఇబ్బందుల్లో ఉన్నారు అనుకో ఊరికే కోపం,విసుకు వస్తుంటుంది.మనందరమూ మనుష్యులమే కదా!కాబట్టి ఎవరు కూడా అన్నీ పట్టి పట్టి చూడ కూడదు.చాలా మందికి మనసులో ప్రేమలు ఉంటాయి,కానీ బయటకు చూపించడం తెలియదు.మనమంటే ప్రేమలేదు అని ఎదుటి వాళ్ళు దిగులు పడుతుంటారు.అందుకనే నేను ప్రతి ఒక్కరికీ చెప్తాను ప్రేమలు వ్యక్తం చెయ్యండి.మీరు తొందర పడ్డారు,అనవసరంగా బాధ పెట్టారు అని అనిపిస్తే మొహమాటం లేకుండా సారీ చెప్పండి.అప్పుడు అపోహలు,అసంతృప్తులు,అనుమానాలు ఉండవు.మన మనసులో అందరినీ సమంగా చూస్తున్నాము అని అనుకుంటే అది మీ మాటలు,చేతలు ద్వారా ఎదుటి వాళ్ళకు అర్థం అయ్యేలా చెయ్యండి.వాళ్ళే మనలని అర్థం చేసుకోవాలి అని అనుకోవద్దు.దీనినే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు.అది లేకుండా చూసుకోండి,దూరాలు పెంచుకోకండి.

Monday, October 28, 2024

తప్పులెన్నువారు……కానీ

తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అని అంటారు.నిజమే!తప్పేముంది?నేను ఉన్నాను.రోజులో నా మొహం రెండు లేక అయిదు నిముషాలు చూసుకుంటాను.రోజు మొత్తం వేరే వాళ్ళనే చూస్తూంటాను,వాళ్ళ మాటలు వింటుంటాను,వాళ్ళ చేతలు చేష్టలు గమనిస్తుంటాను.కాబట్టి వాళ్ళని విశ్లేషణ చేయటం నాకు సులభం.నా గురించి ఆలోచించడానికి అసలు సమయం ఎక్కడ మిగిలింది ఇంక?కానీ ఇక్కడే మనం కొంచెం ఆగి మన గురించి ఆలోచించుకోవాలి.మనం ఎంత సేపూ ఎదుటివాడు గులకరాయి తగిలి తట్టుకున్నాడు అని మందలిస్తాము.కానీ మనం పెద్ద బండరాయి కొట్టుకుని బోళ్ళ పడతాము.ఎదుటివారి తప్పొప్పులు,లోటుపాట్లు క్షుణ్ణంగా చెప్పగలతాము.మనం చాలా నిఖార్సు అయిన మనుష్యులం,మనం అసలు తప్పులు చేయమని గుడ్డి నమ్మకం.ఒక వేళ తప్పు జరిగినా మనల్ని మనం సమర్థించుకునేదానికి సవాలక్ష కారణాలు చెప్తాము.కారణాలు అంబులపొదిలోనుంచి అస్త్రాలు వచ్చినట్లు వస్తాయి.ఈ అతి మనమందరమూ మానుకోవాలి.ఆత్మ శోధన అప్పుడప్పుడు అన్నా చేసుకుంటూ ఉండాలి.మనం తప్పులు చేసుకుంటూ పోతే,పక్కవాళ్ళకి మంచి చెడ్డ ఏమీ చెప్పగలతాము?కాబట్టి ఎదుటి వాళ్ళలో తప్పులను వేలు ఎత్తి చూపించే ముందు మనం ఏ పాటి పద్ధతి గలవాళ్ళమో బేరీజు వేసుకోవాలి.వాళ్ళ పరిస్థితిలో ఉంటే మనం ఎలా వ్యవహరించి ఉంటాము అనే జ్ఞానం మనకు ఉండాలి.ముందు క్షమాగుణం ఉండాలి.ఎదుటి మనిషిని అర్థం చేసుకునేదానికి నిజంగా ప్రయత్నించాలి.

Sunday, October 27, 2024

అద్దం అబద్ధం చెప్పదు

అద్దంలో మనము ఎలా ఉంటామో అలాగే కనిపిస్తాము.దానికి ఏమీ మొహమాటాలు,భయాలు ఉండవు.ఉన్నది ఉన్నట్లే చూపిస్తుంది.అసలైన మంచి స్నేహితుడు అద్దంలాగా ఉండాలి అంటారు.పాత రోజుల్లో రాజులు రాజ గురువులని పెట్టుకునేవారు.వాళ్ళు సలహాలు ఇస్తారు,సంప్రదింపులు చేస్తారు.రాజు తప్పు మార్గం లో ఆలోచించినా,వెళుతున్నా మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళు.ఎందుకంటే వాళ్ళు డబ్బు ఆశించరు.రాజుకు కోపం వస్తుందేమో అని భయపడరు.మన మనసే మనకు అద్దం.మనం ఏదైనా తప్పు చేస్తే మన మనసుకి తెలుస్తుంది చాలా సార్లు.తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది.కనీసం మన మనసుకు మనం తప్పు దార్లో వెళుతున్నాము అనిపిస్తే,ఆగిపోవాలి.ఆ పని చేయకూడదు.ఆ మార్గంలో నడవకూడదు.ఎవరూ చూడటం లేదు,ఎవరికీ తెలియదు అని మనల్ని మనం మోసం చేసుకోకూడదు.మంచి మార్గం లో నడవాలి.మంచి స్నేహితులు ఉంటే మనకు తప్పని తెలియక చేసేపనులను ఆపుతారు.

Friday, October 25, 2024

భయం భయం …పారిపో!

ప్రతి ఒక్కరికీ చాలా రకాల భయాలు ఉంటాయి.కొందరికి బల్లి అంటే భయం,ఇంకొందరికి పిల్లి అంటే భయం.నలుగురులోకి రావాలంటే భయం.పదిమందిలో మాట్లాడాలంటే భయం.నిర్ణయాలు సొంతంగా తీసుకోవాలంటే భయం.ప్రాణ భయం,బీదరికం అంటే భయం,కష్టాలు అంటే భయం.ఇట్లా చెప్పుకుంటూ పోతే సవాలక్ష భయాలు వున్నాయి.మనము ఒకటే ఆలోచించాలి.మనకు భయం అని ఏదీ ఆగదు.మనము ఎదురుకోవాలి అన్నప్పుడు ఎన్ని రోజులు భయపడుతూ కూర్చుంటాము.మనకు భయమని ఎంతమందిని పక్కన పెట్టుకుని పోషిస్తాము?మనకు ధైర్యం జొప్పించేదానికి ఒకరు భుజాలు నొక్కుతూ,మరొకరు వీపు తడుతూ,ఇంకొకరు కాళ్ళు మర్దన చేస్తూ ఉండరు.ఎప్పుడూ మన యుద్ధం మనమే చెయ్యాలి.దానికి కావలసిన ధైర్యం,సన్నాహాలు మనమే చేసుకోవాలి.మనం భయస్థులమని సమస్యలు రాకుండా ఉండవు.ఈ రోజుల్లో అర్జునుడికి కృష్ణుడు వెన్ను తట్టినట్లు ఎవరూ మన వెనకాల ఉండరు.మనమే ద్విపాత్రాభినయం చేసుకోవాలి కృష్ణుడుగా,అర్జునుడిగా.అంటే మనకు మనమే గుండె ధైర్యం తెచ్చుకోవాలి.మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి.కాబట్టి భయాన్ని ఆమడ దూరం పంపించేద్దాము.ధైర్యంగా ముందుకు సాగుదాము.మన ధైర్యమే మనకు సగం గెలుపునిస్తుంది.

Thursday, October 24, 2024

లెక్కలేనితనం మానుకోవాలి

మనం ప్రతి ప్రాణికీ విలువ ఇవ్వాలి.మనమొక్కటే కాదుకదా ఈ భూమిపైన వుండేది?వాటి హక్కులని మనం కాలరాయకూడదు కదా!జంతువుల గురించే అలా మంచిగా మాట్లాడుకుంటున్నప్పుడు సాటి మనుష్యుల గురించి ఇంక ఎంత మంచిగా ఆలోచించాలి?కానీ చాలా చోట్ల పక్కవాళ్ళను కీతాగా చూడటం,అవమానించడం,హింసించడం,లెక్కలేనితనంగా వ్యవహరించడం చూస్తుంటాము.ఎదుటివాళ్ళను మనుష్యులుగా,మనకు సమానంగా చూడటం నేర్చుకోవాలి.మనల్ని చూసేకదా మన బిడ్డలు నేర్చుకుంటారు.వాళ్ళకు మనం మంచిగా విలువలు నేర్పించాలి కదా.ఎదురుతిరగలేనివాళ్ళు,అశక్తులు,చిన్నవాళ్ళు,బీదవాళ్ళు,సంఘంలో పెద్ద పేరుప్రతిష్ఠలులేనివాళ్ళు,అబలలు...వీళ్ళను పీడించడం గొప్ప అనుకునే వర్గం వుంది.ఆ భావజాలం నుంచి అందరూ బయటపడాలి.మనం ఎదుటివాళ్ళకు గౌరవమర్యాదలు ఇస్తేనే వాళ్ళు మళ్లీ తిరిగి మనకు ఇస్తారు.భయంతో మనమాట వినటం గొప్ప కాదు.మనమీద ప్రేమతో,గౌరవంతో మన మాటలకు విలువ దక్కేటట్లు చూసుకోవాలి మనం ఎప్పుడూ.నోటి దురుసు తగ్గించుకోవాలి.తప్పు జరిగితే చిన్నగా అర్థం అయ్యేటట్లు చెప్పి,ఆ తప్పు సరిదిద్దుకునేటట్లు చెయ్యాలి.ఊరికినే అరవటం,కొట్టటం,దూషించటం,కించపరచడం,వ్యంగ్యంగా మాట్లాడటం,తక్కువ చేసి మాట్లాడటం,ఎద్దేవా చేయటం మానుకోవాలి.అందరితో మంచిగా ఉండాలి.సర్దుకుని పోతూండాలి.చిన్నదానికి పెద్దదానికి ఘర్షణలు,గొడవలు మానుకోవాలి.చిన్నా పెద్దా అంతరం గుర్తించాలి.మన మాటలు,చేతలు,ఆలోచనలు ఎప్పుడూ లెక్కలేనితనంగా,ఎదుటివారిని బాధపెట్టే విధంగా,భయపెట్టేవిధంగా ఉండకూడదు.

Monday, October 21, 2024

వానప్రస్థం

పూర్వము రాజులుతమ రాజ్యాన్ని,రాజసంపదను బిడ్డలకు ఇచ్చేసి అడవులకో,హిమాలయాలకో వెళ్లే వాళ్ళు.ఎందుకు అనుకుంటున్నారు?వయసు మీరితే ఒంట్లో శక్తి తగ్గిపోతుంది.శత్రువులతో పోరాడలేము.మన తర్వాత తరం పగ్గాలుతీసుకోవాలి.వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తేనే కదా వాళ్ళు కూడా న్యాయంచేసేది.సంపదలు నా చేతిలో పెట్టుకుంటాను.నిర్ణయాలు నేనే తీసుకుంటాను.నేను చెప్పినట్లు మీరు చెయ్యాలంటే ఎవరు చేస్తారు?అట్లా అని అంత బతుకు బతికి,వాళ్ళ కింద వుండేదానికి మనసు ఒప్పుకోదు.అందుకని అన్నీ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు.దీనినే వానప్రస్థం అంటారు.ఇప్పుడు మనం అడవుల్లోకి,కొండలు గుట్టల్లోకి వెళ్ళలేము.మరి ఏమీ చెయ్యాలి?అంతా నాదే,నా కష్టార్జితమే అనేది మనసులో నుంచి తీసెయ్యండి.మనం మన బిడ్డల కోసమే కదా కష్టపడి సంపాదించింది.మనస్ఫూర్తిగా ఇచ్చేయండి.వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనియ్యండి.వాళ్ళేమీ చిన్న పిల్లలు కాదు,చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు.అందుకని వాళ్ళు చేసే ప్రతిపనిని ఆక్షేపించవద్దు వెనక నుంచి.బి ఎ రోమన్ ఇన్ రోమ్ అని అంటారు కదా.ఇప్పుడు పెత్తనం వాళ్లది,కాబట్టి గౌరవంగా పక్కకు తప్పుకుందాము.వాళ్ళ నిర్ణయాలు వాళ్ళనే తీసుకోనిద్దాము.అతిగా జోక్యం వద్దు.ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇప్పుడు కొత్త వానప్రస్థాలు.ఓపిక ఉన్నన్ని రోజులు సొంతగా ఉండండి.బిడ్డలకు సహాయంగా ఉండండి.ఏ పరిస్థితి అయినాప్రశాంతత కోల్పోవద్దు.ఆత్మ న్యూనత వద్దు.చాలా మంది మనకే ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చిన్న చిన్న వాటికే దిగులు పడుతుంటారు.ఎందుకు?ఎంత పోరాటం చెయ్యకపోతే జీవితంలో ఇంత దూరం వచ్చాము?ఒక్కొక్కళ్ళకి ఒక్కోరకం ఇబ్బందులు వచ్చి ఉంటాయి.అవన్నీ దాటుకుని వచ్చాము కదా!ఉన్నంతలో సంతోషంగా ఉందాము,సంతోషాన్ని పంచుదాము,పెంచుదాము.

Saturday, October 19, 2024

చద్దెన్నము తిన్న ఇల్లాలు

చద్దెన్నము తిన్న ఇల్లాలికి మొగుడు ఆకలి తెలియదంటారు.మొగుడి ఆకలి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా బిడ్డల ఆకలి తెలుస్తుంది.శబరి ఏమీ చేసింది?తను రాముడికి సమర్పించాలి అనుకున్న పళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని కొరికి చూసింది.ఇంట్లో మన అమ్మ కూడా అలాగే అన్ని చూసుకుని చేస్తుంది.ఇంత పనులు చెయ్యాలంటే శక్తి ఉండాలి కదా ఒంట్లో.మరి ఏమీ తినకపోతే,పొద్దున లేచి ఒంట్లోకి శక్తి ఎట్లా వస్తుంది?నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను.మొదట మీరు తినండి.తరువాత ఇంట్లో వాళ్ళకు పెట్టండి అని.ఇట్లా చేస్తే రెండు లాభాలు మనకు.ఉప్పులు కారాలు సరిగ్గా పడ్డాయో లేదో తెలుస్తుంది.రెండోది ఏంటంటే,ఇంట్లో వాళ్లకి మంచిగా,ఓపికగా,సంతోషంగా పెట్టగలతాము భోజనం.లేకపోతే నీరసానికి,ఆకలికి చేసే పని మీద సరైన ధ్యాస ఉండదు.ఊరికినే ఇంట్లో వాళ్ళను విసుక్కుంటూ,కసురుకుంటూ వుంటాము.లేకపోతే చెయ్యలేక కళ్ళలో నీళ్ళు కుక్కుకుంటూ వుంటాము.ఇవన్నీ అంత అవసరమా?మనము ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళ బాగోగులు పట్టించుకోగలము.కాబట్టి మంచిగా పొద్దున అల్పాహారం తీసుకోండి.ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళకు అన్నాలు పెట్టడానికి చాలా ఓపిక,సహనం కావాలి.ఆకలి పైన అవి పక్కకు వెళ్ళిపోతాయి.విసుకు,కోపం వస్తుంటాయి.కాబట్టి ఒక ముద్ద మీరు ముందు తిని,తరువాత వాళ్ళకు పెట్టండి.అయ్యో!ఇంట్లో వాళ్లందరూ తినకుండా మనమెట్లా తింటాము అని ఆలోచించవద్దు.అందరి మంచికోసమే నేను చెప్పేది.

Thursday, October 17, 2024

సహనం సహజ గుణం గా…..

మనకు కోపాలు తాపాలు అన్నీ ఎక్కువే.కానీ చాలా సార్లు జీవితంలో చాలా పోగొట్టుకుంటుంటాము.అందుకనే పెద్దలు నిలిచి నిదానంగా పోవాలి అని అంటారు.నిజమే!ఎందుకంటే సీతా దేవి అంతటి ఆమే రావణుడు తీసుకెళితే,తొందరపడి అఘాయిత్యం చేసుకోలేదు.ఓపికగా రాముడు కోసం ఎదురుచూసింది.దైవాంశ సంభూతులు అయినవాళ్ళే కష్టాలు పడ్డారు.సహనంతో కష్టాలనుండి బయటపడ్డారు.ఇక మనమెంత?మనం తీసుకునే ప్రతి పెద్ద అడుగు ఆచి తూచి,పూర్వాపరాలు తెలుసుకుని,పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు అడుగు వెయ్యాలి.ముందర మనలను మనం సరిగ్గా అంచనా వేసుకోవాలి.ఎదుటివాళ్ళు వాళ్ళ స్వలాభాలకోసం చాలా సార్లు నువ్వు ఇంద్రుడివి,చంద్రుడివి,తోపువి అని ఆకాశం కి ఎత్తేస్తుంటారు.అవన్నీ నిజం అని నమ్మకూడదు.మన పాదాలు ఎప్పుడూ నేల పైనే ఉండాలి,ఆకాశం లో కాదు.సంయమనం పాటించాలి.అలా ఉండాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.చెప్పుడు మాటలు వినకూడదు.మన తాహతు మనకు తెలియాలి.మన బలాలు ఒక్కటే కాదు,మన బలహీనతలు కూడా ఖచ్చితంగా తెలియాలి.వాటిని ఎదుటివాడు ఒడిసి పట్టుకోకుండా జాగ్రత్త పడాలి.జీవితం అంటే ఒక రకంగా యుద్ధమే.ఊరికినే కత్తి తీసి కనిపించినవాడిని పొడవటం కాదు.బుర్ర పెట్టి ఆలోచించాలి.మనం ఏమి చేస్తే,ఎలా చేస్తే,ఎప్పుడు చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే అవగాహన మనకు ఉండాలి.ఊరికే వాళ్ళు చెప్పారు,వీళ్లు చెప్పారు,నాకు సరిగ్గా అర్థం కాలేదు పరిస్థితి అని తరువాత మనల్ని మనం సమర్థించుకోకూడదు.ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం చేసే పనులకు మనమే బాధ్యులం కదా!

Wednesday, October 16, 2024

పొద్దున మనము లేవాలి…

పొద్దున మనమూ లేవాలి,పళ్ళను బాగా తోమాలి అని పిల్లలకు నేర్పిస్తాము.ఎర్లీ టు రైజ్ అండ్ ఎర్లీ టు బెడ్ అని వింటుంటాము.ఇది నిజంగా చాలా మంచి అలవాటు.కానీ పిల్లలకు చెప్తాము కానీ,చాలా సార్లు పెద్దవాళ్ళము పాటించము.సూర్యోదయం ముందర లేవాలి.అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.తెల్లవారితే వుండే రణగొణ ధ్వనులు ఉండవు.గాలి కూడా చాలా మటుకు శుభ్రంగా,పొల్యూషన్ లేకుండా ఉంటుంది.మార్నింగ్ వాక్ చేసుకునే వాళ్ళు సంతోషంగా,స్థిమితంగా చేసుకోవచ్చు.అదే అర్ధరాత్రి దాకా మేలుకుని,అపరాహ్ణం లేస్తే ఎలా ఉంటుంది?ఇంట్లో వాళ్ళు ఇంకా లెయ్యలేదని విసుక్కుంటూ ఉంటారు.ఆ ఛీదరలు,చీత్కారాలు వింటూ లెయ్యాలి.ఆలస్యంగా లేస్తాము కాబట్టి కడుపులో జఠరాగ్ని ఎక్కువ అవుతుంది.అలా ఉన్నప్పుడు పళ్లు తోముకున్నా,కడుపులో దేవుతుంది.ఒక్కొక్కసారి నోట్లోకి కూడా వస్తుంది.పళ్ళు మళ్ళా తోముకుందాములే,ముందర కడుపులోకి ఏమన్నా తినేద్దాము అనుకునే వర్గం కూడా ఉంటుంది.ఇంక హడావుడిగా అన్నిటికీ ఉరుకులు పరుగులు పెడుతుండాలి.అదే పొద్దునే లేస్తే,అన్ని పనులు సక్రమంగా,సజావుగా,ప్రశాంతంగా జరుగుతాయి.ఎవరూ మనల్ని విసుక్కోరు,కసురుకోరు,ఈసడించుకోరు,తక్కువ చేసి మాట్లాడరు ఆలశ్యంగా వచ్చామని,పని సరిగ్గా చెయ్యలేదని.కాబట్టి రోజు అంతా సామరస్యంగా జరిగిపోతుంది.పొద్దున్నే లెయ్యాలి అంటే రాత్రిళ్ళు త్వరగా పడుకోవాలి.దేనికైనా క్రమశిక్షణ ఉండాలి.క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేము.మనం చేరుకోవాల్సిన గమ్యం దగ్గరలో ఉన్నా చెయ్యి జారిపోతుంది జీవితంలో క్రమశిక్షణ లేకపోతే.

Tuesday, October 15, 2024

ఏక భుక్తం భూశయనం

మా చిన్నప్పుడు మా బాబు(నాన్న)ఎప్పుడూ చెప్పేవాడు.బ్రహ్మచర్యం నిష్టగా పాటించేవాళ్ళు ఏకభుక్తం భూశయనం తప్పకుండా ఆచరించాలిఅని.పెళ్ళి కాని వాళ్ళు చదువుకునే వాళ్ళు తాంబూలం వేసుకోకూడదు అని.ఏమీ లేదు.సుగంథ ద్రవ్యాలు వాడకూడదు అని.నాలుక మొద్దుబారిపోతుంది.ఉచ్ఛారణ సరిగ్గా వుండదు అని.ఏక భుక్తం అంటే ఒంటి పూట భోజనం అని అర్థం.భూశయనం అంటే పరుపులు అవి లేకుండా కటిక నేల పైన పండుకోవాలి.ఇలా కఠినంగా,క్రమశిక్షణగా వుంటేగానీ చదువు వంట పట్టదని పెద్దల నమ్మకం. ఇప్పుడు అలాంటి పద్థతులు లేవు,ఎవరూ పాటించరు. ఏక భుక్తం అంటే సుమారు ఈ రోజు మథ్యాహ్నం భోజనం చేస్తే ,మళ్ళీ రేపు అన్నం తినేదాక ఏమీ తినకూడదు అని.అంటే ఒక్కపొద్దు వున్నట్లే కదా! ఇప్పుడు చాలా మంది అది పాటిస్తున్నారు కొంచెం మార్పులు చేర్పులతో.16 గంటల ఫాస్టింగ్ అంటారు.8గంటలు ఏమైనా తినవచ్చు,ఎంతైనా తినవచ్చు.కానీ ఆఖరున తిన్నప్పటినుంచి 16 గంటలు ఏమీ తినకూడదు. ఇంకా కొంతమంది కొన్ని రోజులు అనుకుని నీళ్ళు మటుకే తాగుతారు.ఒక్క పొద్దు వుండటం ఒంటికి మంచిది అని తెలుసుకున్నారన్న మాట.మన పెద్దలు చెప్తారు కదా...లంఖణం దివ్యౌషథం అని. వీపు పట్టుకున్నా,మెడ పట్టుకున్నా,నడుము పట్టుకున్నా,నేల పైన పండుకుంటే తగ్గుతాయి కదా.అంటే భూశయనం మంచిదే కదా!!!

జిహ్వచాపల్యం…..అవసరమా?

ఇంట్లో అమ్మలు,అమ్మమ్మలు,అత్తలు,నానమ్మలు వుండి పూట పూటకు రుచులు రుచులుగా చేసి పెడుతుంటే,ప్రతి ఒక్కరికీ జిహ్వ చాపల్యం ఉండి తీరాల్సిందే.కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగ లేవు చాలా ఇండ్లలో.అప్పుడు పరిస్థితి ఏంది?క్షణాల్లో పొద్దున టిఫిన్ అయిపోవాలి,కడుపులోకి కూడా పోవాలి.మధ్యాహ్నం లంచ్ కి గబ గబా ఏదో ఒకటి కుక్కుకుని,మళ్ళీ సీట్ లోకి వెళ్లి పని చూసుకోవాలి.ఈ పరిస్థితులలో రుచులకు చోటు ఏది?మన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారు.మంచి పరిణామం.నథింగ్ వైట్ అనే ఉద్యమం బాగా నడుస్తుంది.అంటే పాలు,చక్కెర,పిండి పదార్థాలు,బియ్యం లాంటివి వద్దు అని.ఇంకో వర్గం నూనెలు వద్దు,కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే కష్టం అంటుంది.ఇవన్నీ తప్పని కాదు కానీ మరీ భయపడి ఎండుకు పోకూడదు కదా. ఇప్పుడు చద్దెన్నాలు తినేవాళ్లు లేరు.ఇడ్లీ దోసెలు వీకెండ్ కి జరిగిపోయాయి చాలా మంది ఇండ్లలో.రాగి జావ,గ్రిట్స్,ఓట్స్,ఫ్రూట్స్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. రుచులు రుచులుగా చేస్తే ఒకటి తినాల్సింది నాలుగు తింటాము.ఉప్పు వేస్తే బీపీ అంటాము.చక్కెర వేస్తే షుగర్ అంటాం.కారం వేస్తే కడుపులో మంట అంటాము.అయితే ఇప్పుడు ఎలా? అందుకనే ప్రతిదీ చిన్నప్పటి నుంచీ మితంగా తీసుకుంటే, చాలా ఆరోగ్య సమస్యలు నుండి బయట పడవచ్చు.ఇంకో రెండు ముద్దలు తింటే కడుపు నిండుతుంది అంటే,ఇప్పుడే ఆపెయ్యాలి.చిన్నప్పుడు మా బాబు(నాన్న)చెప్పేవాడు.కడుపులో సగం అన్నం ఉండాలి.పావు భాగం నీళ్లు ఉండాలి.మిగిలిన పావు భాగం కాళీగా ఉండాలి.రుచిగా తినకూడదు అని కాదుకానీ,ఆరోగ్యం పట్ల కూడా అవగాహన పెంచుకుంటే బాగుంటుందిమనందరమూ.